రష్యాలో ఇప్పుడు వాట్సాప్ సేవలను నిలిపివేసి, స్వదేశీ యాప్లయిన’వీకే మెసెంజర్’ (VK Messenger) లేదా ‘టెలిగ్రామ్’ వంటి వాటిని వాడుకోవాలని అక్కడి ప్రభుత్వం, ప్రజలు నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ దేశ డేటా తమ దగ్గర మాత్రమే ఉండాలని, విదేశీ కంపెనీల నిఘా వద్దనే ఉద్దేశంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ ప్రశ్నే ఇప్పుడు భారత్ ముందు కూడా నిలుస్తోంది. నిజమే మన దగ్గర అరట్టై (Arattai), సందేశ్ (Sandes), ఎలిమెంట్స్ (Elyments) వంటి స్వదేశీ యాప్స్ ఉన్నా కూడా, ఇండియన్స్ మాత్రం వాట్సాప్ను వదలలేకపోతున్నారు.
నిజానికి భారత్లో వాట్సాప్(WhatsApp) బలాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం, భారత్లో సుమారు 55 నుంచి 60 కోట్ల మందికి పైగా వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. అంటే అమెరికా జనాభా కంటే కూడా ఎక్కువ మంది భారతీయులు ఈ వాట్సాప్ యాప్ మీద ఆధారపడి ఉన్నారు.
కేవలం మెసేజ్ల కోసమే కాదు, వ్యాపారాలు, చదువులు, చివరికి గవర్నమెంట్ సమాచారం కూడా ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఈజీగా సాగుతోంది. మరి ఇంత మంది యూజర్లు ఉన్నప్పుడు, భారత దేశం ఎందుకు రష్యా లాగా సొంత యాప్ను సక్సెస్ చేయలేకపోయిందనే ప్రశ్న వినిపిస్తోంది.
దీనికి ప్రధాన కారణం చెప్పుకోవాల్సింది నెట్వర్క్ ఎఫెక్ట్ (Network Effect). అంటే, మీరు మాత్రమే ఒక కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు, మీ స్నేహితులు, బంధువులు, ఆఫీస్లో వాళ్లు అందరూ అదే యాప్ డౌన్ లోడ్ చేయాలి. చాలామంది భారతీయులు ఇటీవల ‘అరట్టై’ వంటి యాప్లను డౌన్లోడ్ చేసినా, అందులో తమకు తెలిసిన వారు ఎవరూ లేకపోవడం, ఉన్నా కూడా పెద్దగా రియాక్టవకపోవడంతో..వారంతా మళ్లీ వాట్సాప్ వైపే మొగ్గు చూపారు.
దీనికి తోడు వాట్సాప్ అందించే ‘యూజర్ ఇంటర్ఫేస్’ చాలా ఈజీగా ఉండటం, తక్కువ ఇంటర్నెట్ ఉన్నా పనిచేయడం వంటిది సామాన్యులను ఆకట్టుకుంది. స్వదేశీ యాప్లు టెక్నికల్గా బాగున్నా, వాట్సాప్తో పోటీ పడే స్థాయిలో ఫీచర్లను రెగ్యులర్గా అప్డేట్ చేయడంలో కొంత వెనుకబడటం కూడా దీనికి కారణమే. అంతేకాదు భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశంలో వాట్సాప్ను బంద్ చేయాలంటే .. మన సొంత యాప్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది.
మరో ముఖ్యమైన కారణం విశ్వసనీయత ,అలవాటు. భారతీయులలో చాలామంది ఒకసారి ఒక టెక్నాలజీకి అలవాటు పడితే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. రష్యా , చైనా వంటి దేశాల్లో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తుంది కాబట్టి అక్కడ సొంత యాప్స్ వాడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.
కానీ భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం కావడంతో..ఇక్కడ ప్రజలు తమకు నచ్చిన యాప్ వాడుకునే స్వేచ్ఛ ఉంది. డేటా ప్రైవసీ విషయంలో వాట్సాప్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే, నా డేటా తీసుకుని వాళ్లు ఏం చేసుకుంటారులే అనే ఫీలింగ్ వల్ల కూడా వాట్సాప్లోనే కొనసాగుతున్నారు.
అయితే, రష్యా బాటలోనే ఇప్పుడు భారత్ వెళ్లే అవకాశం ఉందా అంటే, అది ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చు. అయితే ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిజిటల్ సార్వభౌమాధికారం కోసం కృష్టి చేస్తూనే ఉంది. మన స్వదేశీ యాప్స్ కూడా వాట్సాప్(WhatsApp) లాగే యూజర్ ఫ్రెండ్లీగా మారి, డేటా సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెరిగితే తప్పకుండా మార్పు వస్తుంది.
