Tirumala
తిరుమల (Tirumala)శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైకుంఠ ద్వార దర్శనం తేదీలను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం-Tirumala) పాలక మండలి ప్రకటించింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు సుదీర్ఘంగా నిర్వహించబడుతున్నట్లు ప్రకటించారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ ఈ వివరాలను వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనం షెడ్యూల్..
డిసెంబర్ 30, 2025.జనవరి 8, 2026.. పది రోజుల పాటు భక్తులకు ఈ దర్శనం అందుబాటులో ఉంటుంది. ఈ పది రోజుల పాటు భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ దర్శనానికి సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ టోకెన్ల జారీ ప్రక్రియ , తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఈవో తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.
శ్రీవారి భక్తుల విజ్ఞప్తితో టీటీడీ మరో ముఖ్యమైన మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు డిప్ విధానం (లక్కీ డిప్) ద్వారా జారీ చేసిన అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానాన్ని టీటీడీ(Tirumala) మార్చింది.
భక్తులకు అనుకూలంగా ఉండేందుకు, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన (First Come, First Served) వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు ఈవో సింఘాల్ వివరించారు.
టీటీడీ కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అధునాతనమైన ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ సెంటర్ ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, క్యూ కంపార్టుమెంట్ల పర్యవేక్షణ వంటి తొమ్మిది రకాల సేవలను అందిస్తున్నారు. ప్రతి భక్తుడి డేటాను సమర్థవంతంగా సేకరించడానికి కూడా ఈ కేంద్రాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు నిధులు.. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో రూ. 750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో సుమారు 5 వేల భజన మందిరాలను నిర్మించడానికి టీటీడీ నిర్ణయించింది.
అటవీ సంరక్షణ.. తిరుమల అటవీ ప్రాంతంలో రాబోయే పదేళ్లలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
అన్నప్రసాదం.. టీటీడీ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
దర్శన టోకెన్ల కమిటీ.. శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్ల జారీ విధానంపై భక్తుల సూచనలతో పరిశీలించి నివేదిక సమర్పించడానికి టీటీడీ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
కార్తీక బ్రహ్మోత్సవాలు.. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి.
అమరావతి పనులు.. ఈ నెల 27వ తేదీ నుంచి అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారం, కల్యాణోత్సవం మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
