Mysterious Temples
భారతదేశం అంటే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా భావిస్తారు. ఇక్కడి ప్రతీ నేలలోనూ, గాలిలోనూ, ప్రతి శిలలోనూ ఒక కథ వినిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాలు కేవలం భక్తికి మాత్రమే కేంద్రాలు కాదు, అద్భుతమైన ఇంజనీరింగ్తో పాటు సైన్స్కు అందని రహస్యాలకు వేదికలు అంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఆలోచించేంతగా ఈ మర్మమైన దేవాలయాలలో (Mysterious Temples) ఎన్నో వింతలు ఉన్నాయి.
కేరళలోని పద్మనాభస్వామి దేవాలయం – నిగూఢమైన ఏడో తలుపు..తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా చెబుతారు. అయితే, ఇక్కడి నిజమైన మర్మం ఆరో నేలమాళిగలోని ‘బి’ (Vault B) తలుపు. ఈ తలుపునకు ఎటువంటి గొళ్లెం కానీ తాళం కానీ ఉండదు. దానిపై రెండు పెద్దపెద్ద నాగుపాములు చెక్కి ఉంటాయి. సిద్ధ పురుషులు , సాధువులు ‘గరుడ మంత్రం’ పఠిస్తేనే ఈ తలుపు తెరుచుకుంటుందని, వేరే ఇతర మార్గంలో తెరిచినా ప్రపంచానికి ముప్పు వాటిల్లుతుందని నమ్ముతారు. ఇప్పటికీ ఈ తలుపు వెనుక ఏముందో ఎవరికీ తెలియదు.
ఒడిశాలోని జగన్నాథ ఆలయం –గాలికి ఎదురుగా ఎగిరే జెండా ..పూరీ జగన్నాథ ఆలయం ఎన్నో వింతలకు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా గాలి ఏ దిశలో వీస్తే జెండా ఆ దిశలోనే ఎగురుతుందనేది మనకందరికీ తెలుసు. కానీ ఇక్కడ జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అంతేకాదు, ఈ ఆలయ గోపురం నీడ.. పగలు ఏ సమయంలో కూడా భూమి మీద పడదు. అలాగే ఈ ఆలయం పైన ఎటువంటి పక్షులు గానీ, విమానాలు గానీ ఎగరవు. సముద్రపు తీరంలో ఉన్నా కూడా, ఆలయ సింహద్వారం లోపలికి అడుగు పెట్టగానే సముద్రపు అలల శబ్దం ఏ కొంచెం కూడా వినిపించదు. ఇవన్నీ సైన్స్కు అంతుచిక్కని అద్భుతాలే అంటారు చరిత్రకారులు.
ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి – గాలిలో వేలాడే స్తంభం..అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం శిల్పకళా చాతుర్యానికి నిలయంగా చెబుతారు ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ దాదాపు 70 స్తంభాల వరకూ ఉంటాయి, కానీ అందులో ఒకటి మాత్రం భూమికి ఆనకుండా గాలిలోనే వేలాడుతూ ఉంటుంది. ఆ స్తంభం కింద నుంచి ఒక వస్త్రాన్ని కానీ పేపర్ ను కానీ అవతలి వైపు తీసుకుని వెళ్లొచ్చు. కొన్నేళ్ల క్రితం ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఆ స్తంభాన్ని కదిలించి దాని వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవాలని ప్రయత్నించగా, ఆలయమంతా కదలడం మొదలైందట. ఇది ఆనాటి శిల్పుల ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తా అనేది ఇప్పటికీ మిస్టరీనే.
అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయం – రక్తంతో పారే నది..గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య దేవి శక్తి పీఠం అత్యంత మర్మమైంది. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి విగ్రహం ఉండదు. కేవలం యోని ఆకారంలో ఉన్న ఒక శిలను పూజిస్తారు. ప్రతి ఏటా జూన్ నెలలోని ఒక మూడు రోజుల పాటు ఆలయం పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది. ఆ సమయంలో అమ్మవారు రజస్వల అవుతారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ మూడు రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. శాస్త్రవేత్తలు నీళ్ల రంగు మార్పుపై ఎన్ని పరిశోధనలు చేసినా, కచ్చితమైన కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు.
మధ్యప్రదేశ్లోని కాలభైరవ ఆలయం – మద్యం సేవించే దేవుడు..ఉజ్జయినిలో గల కాలభైరవ స్వామికి భక్తులంతా మద్యాన్ని (Liquor) నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారి ఒక గిన్నెలో మద్యాన్ని స్వామివారి నోటి దగ్గర పెడతారని, అది క్షణాల్లో ఖాళీ అయిపోతుందని భక్తులు చెబుతారు. అయితే ఆ మద్యం ఎక్కడికి వెళ్తుంది? ఎలా వెళ్తుందనేది ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారట. విగ్రహం లోపల ఎటువంటి పైపులు గానీ, రంధ్రాలు గానీ లేవని పురావస్తు శాఖ ఇప్పటికే ధృవీకరించింది.
ఒడిశా కోణార్క సూర్య దేవాలయం – అయస్కాంత శక్తి .. కోణార్క సూర్య దేవాలయం ఒక రథం ఆకారంలో ఉంటుంది. పూర్వం ఈ ఆలయ గోపురం మీద 52 టన్నుల భారీ అయస్కాంతం ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ఆ అయస్కాంత శక్తి వల్ల సముద్రంలో ప్రయాణించే ఓడలు దారి తప్పేవని, అందుకే డచ్ నావికులు దానిని తొలగించేసారని అంటారు. ఇప్పటికీ ఆ చక్రాల నీడను బట్టి సమయాన్ని సెకన్లతో సహా కచ్చితంగా టైమును లెక్కపెట్టొచ్చు.
మన దేశంలోని ఈ మర్మమైన దేవాలయాలు(Mysterious Temples)అన్నీ మన పూర్వీకుల మేధస్సుకు , ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనాలు. సైన్స్ ప్రతిదానికీ ఒక వివరణ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది కానీ, ఈ అద్భుతాల దగ్గర అది కూడా ఆగిపోతుంది. ఈ రహస్యాలు మన సంస్కృతిలో లోతును, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.
