Womens T20 World Cup
ఒకవైపు టీ 20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ మొదలుకానుంది. ఐపీఎల్ ముగిసిన పది రోజులకే మరో మెగాటోర్నీ అభిమానులను అలరించబోతోంది. ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్(Womens T20 World Cup) 2026 జూన్ 12 నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీలో 12 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 12న జరిగే ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ , శ్రీలంకతో తలపడుతుంది. మహిళల క్రికెట్ లో ఇది పదో టీ20 ప్రపంచకప్ ఎడిషన్. జూలై 5 వరకూ జరిగే టీ20 ప్రపంచకప్ లో ఎప్పటిలానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పైనే అందరి చూపు ఉంది. ఈ సారి జూన్ 14న ఇరు జట్లు తలపడబోతున్నాయి.
కాగా 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా.. గ్రూప్ 2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ చోటు దక్కించుకున్నాయి. న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది.
గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదు మ్యాచ్లు ఆడనుండగా… రెండు గ్రూపుల నుండి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి. భారత్ తన ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుండగా.. తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను ఢీకొంటుంది. అన్ని మ్యాచ్ లూ రాత్రి 7 గంటలకు ఆరంభమవుతాయి.
భారత్ లో అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ షెడ్యూల్ ను ఇలా రూపొందించింది. కాగా టోర్నీ నాకౌట్ స్టేజ్ జూన్ 30న మొదలవుతుంది. జూన్ 30న తొలి సెమీస్ , జూలై 2న రెండో సెమీస్ ది ఓవల్ గ్రౌండ్ లో నిర్వహిస్తారు. ఇక టైటిల్ పోరుకు జూన్ 5న ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు పొట్టి క్రికెట్ లోనూ అదరగొట్టాలని ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్ లో భారత్ ఛాంపియన్ కాలేకపోయింది. మరోవైపు ఈ మెగాటోర్నీలో ఆస్ట్రేలియా 6 సార్లు విజేతగా నిలిచి మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఘనత సాధించింది.
