India vs New Zealand : న్యూజిలాండ్ ప్రతీకారం..రెండో వన్డేలో భారత్ పరాజయం

India vs New Zealand : రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

India vs New Zealand

తొలి వన్డే గెలిచిన జోష్ తో రెండో మ్యాచ్ లోనూ జోరు చూపించి వన్డే సిరీస్ గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను సమం చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ నిరాశ పరిచింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 24 , మరో హాఫ్ సెంచరీ చేసిన గిల్ 53 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 17 బంతుల్లో 8 ,కోహ్లి 29 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు.

రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 44 బంతులు ఆడిన రవీంద్ర జడేజా 27 పరుగులకు వెనుదిరగ్గా,  నితీష్ కుమార్ రెడ్డి , కేఎల్ రాహుల్ ఆరో వికెట్‌కు 57 పరుగుల పార్టనర్ షిప్  నెలకొల్పారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి భారీ ఇన్నింగ్స్ గా మలచలేక  20 రన్స్ కు పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించాడు.

మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్   జట్టు‌కు మంచి స్కోర్ అందించాడు. కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంత్ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు తీయగా.. జెమీసన్, ఫోక్స్, లెనాక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

India vs New Zealand

285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కాన్వే (16), నికోలస్ (10) పరుగులకు ఔట్ అయ్యారు. ఈ దశలో డారిల్  మిచెల్ , విల్ యంగ్ ఆదుకున్నారు. మూడో వికెట్ కి 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మ్యాచ్ పై పట్టు సాధించారు.

ముఖ్యంగా డారిల్  మిచెల్ అదిరిపోయే ఆటతో భారత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ యంగ్ (87) రన్స్ కు ఔట్ అయినా మిచెల్ మాత్రం అదరగొట్టాడు. సెంచరీతో మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో న్యూజిలాండ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మిచెల్ 117 బంతుల్లో 11 ఫోర్లు , 2 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచాడు. భారత్ బౌలర్లు ఈ మ్యాచ్ లో అస్సలు ప్రభావం చూపలేక పోవడం ఆశ్చర్య పరిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్ లో జరుగుతుంది.

ICC U19 World Cup 2026 : కుర్రాళ్ళు అదరగొట్టేస్తారా ?..అండర్ 19 వరల్డ్‌కప్ కు అంతా రెడీ

Exit mobile version