T20 World Cup
టీ20 ప్రపంచకప్(T20 World Cup) మొదలవ్వడానికి ముందు చిన్న జట్ల విషయంలో చాలా కామెంట్స్ వినిపించాయి. దాదాపు సగం జట్లు చిన్న దేశాలే కావడంతో టోర్నమెంట్ ఆసక్తిగా ఉండదంటూ చాలా మంది పెదవి విరిచారు. చిన్న జట్లకు సెపరేట్ గా వరల్డ్ కప్ పెట్టాలంటూ ఐసీసీకి సలహాలు కూడా ఇచ్చారు. అయితే టోర్నీ మొదలైన తర్వాత వారి అభిప్రాయం మార్చుకోక తప్పలేదు. ఎందుకంటే చిన్న జట్లు పెద్ద జట్లకు చెమటలు పట్టిస్తున్నాయి.
అసలు సిసలు ఆటతీరుతో కంగారు పెడుతున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లను చూస్తే ఈ విషయం అంగీకరించాల్సిందే. తాము పసికూనలు కాదు కసికూనలు అంటూ నిరూపిస్తున్నాయి. నెదర్లాండ్స్, ఐర్లాండ్ , స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ ఇలాంటి చిన్న జట్లు తమను తక్కువ అంచనా వేయొద్దని ఆటతోనే వార్నింగ్ ఇస్తున్నాయి.
వన్డే ఫార్మాట్ తో పోలిస్తే టీ ట్వంటీల్లో సంచలనాలు నమోదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పైగా చిన్న జట్లలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉండడంతో వారి ఫీల్డింగ్ పెద్ద జట్ల కంటే ఖచ్చితంగా మెరుగ్గానే ఉంటుంది. ఇలాంటి అడ్వాండేజ్ లతోనే పసికూనలు చెలరేగిపోతున్నాయి.
తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పాకిస్థాన్ కు ఎలాంటి వణుకు పుట్టించిందో అందరికీ తెలుసు. చివర్లో పాక్ బ్యాటర్ ఫహీమ్ సిక్సర్లతో ఆదుకోకుంటే ఖచ్చితంగా సంచలనం నమోదై ఉండేది. తర్వాత వెస్టిండీస్ కు కూడా స్కాట్లాండ్ ఊహించని పోటీ ఇచ్చింది.
ఇక టీమిండియా తొలి మ్యాచ్ లో ఏం జరిగిందో అభిమానులు మరిచిపోలేరు. యూఎస్ఏపై కేవలం 77 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆదుకోకుంటే భారత్ కు పెద్ద షాకే తగిలేది. ఇక రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ కు నేపాల్ వణుకు పుట్టించింది. దాదాపు ఓడించినంత పని చేసింది. అది కూడా అత్యుత్తమ బౌలర్లు ఉన్న ఇంగ్లాండ్ పై నేపాల్ బ్యాటర్ల భారీ షాట్లు టోర్నీకే హైలెట్ గా నిలిచాయి.
ముఖ్యంగా ఆర్చర్ ను నేపాల్ బ్యాటర్లు ఉతికారేసిన తీరు ఎవ్వరూ మరిచిపోలేరు. కాస్త అనుభవ రాహిత్యంతో వెనుకబడిన నేపాల్ ఇంకొంచెం అప్రమత్తంగా ఉండి ఉంటే పెను సంచలనం నమోదై ఉండేది. ఇక ఇటలీ నేపాల్ జట్టుకు షాకివ్వడం, భారత్ పై నమీబియా కూడా ఆకట్టుకుంది. కీలక సమయంలో వరుస వికెట్లు తీసి టీమిండియాను కాస్త కంగారు పెట్టింది. ఇక రానున్న మ్యాచ్ లలో చిన్న జట్లు నుంచి సంచలనాలు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
