ICC OD RANKINGS
వన్డే క్రికెట్ లో తగ్గేదే లేదంటున్నారు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ…ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC OD RANKINGS)లో టాప్-2లో నిలిచిన వీరిద్దరూ అగ్రస్థానం కోసం నువ్వా నేనా అంటూ ఢీకొంటున్నారు. మొదట ఆసీస్ టూర్ లో, తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్ లో వీరిద్దరూ దుమ్ములేపారు. కోహ్లి అయితే బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు బాదేశాడు. అటు హిట్మ్యాన్ సైతం ఫిట్ గా కనిపించడమే కాదు తన ఫామ్ కూడా కంటిన్యూ చేశాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ లో తాము ఖచ్చితంగా ఆదతామనే సంకేతాలు బలంగా ఇచ్చారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్(ICC OD RANKINGS) లో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు.
టాప్ ప్లేస్ కోసం రోహిత్, కోహ్లి మధ్య రసవత్తర రేసు నడుస్తోంది. తాజాగా విడుదలైన జాబితాలో రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో ఉండగా.. కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఆసీస్ టూర్ లో చివరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. సౌతాఫ్రికాపై మాత్రం అదరగొట్టేశాడు. వరుసగా రెండు సెంచరీలు బాదేసి, మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సిరీస్ లో 302 రన్స్ సాధించి టాప్ స్కోరర్ గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఈ ప్రదర్శనతో కోహ్లి తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకొని టాప్ ప్లేస్ కు చేరువయ్యాడు.
ప్రస్తుతం కోహ్లికి, రోహిత్ కు మధ్య తేడా 8 రేటింగ్ పాయింట్లే. రోహిత్ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 773 పాయింట్లతో రెండో ప్లేస్ లో నిలిచాడు. భారత వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ ఐదో స్థానంలో ఉండగా.. శ్రేయాస్ అయ్యర్ పదో స్థానానికి పడిపోయాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకులో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆసీస్ సిరీస్ లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిస్తే.. కోహ్లి సౌతాఫ్రికా సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సాధించాడు.
దీంతో ఒకరితో ఒకరు పోటీపడుతూ ఐసీసీ ర్యాంకింగ్స్(ICC OD RANKINGS) లోనూ నువ్వా నేనా అంటున్నారు. కాగా తమ ఫామ్, ఫిట్ నెస్ పై వస్తున్న అనుమానాలకు వీరిద్దరూ ఇప్పటికే తెరదించేశారు. హెడ్ కోచ్ గంభీర్ తో పొసగడం లేదన్న వార్తలు వస్తున్నప్పటికీ 2027 వన్డే ప్రపంచకప్ లో ఖచ్చితంగా రోకో జోడీ ఉండాలని పలువు మాజీ క్రికెటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం వీరిద్దరి ప్లేస్ పై గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే రోహిత్, కోహ్లి టెస్ట్ ఫార్మాట నుంచి తప్పుకోవడానికి గంభీరే కారణమన్న ప్రచారం ఉంది. దీంతో వన్డే జట్టు నుంచి కూడా రోకో జోడీని పంపించేంచుకు గంభీర్ పావులు కదుపుతున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
