Jealous Loop
మనిషికి ఉన్న బలహీనతల్లో అన్నింటికంటే డేంజర్.. అసూయ. పక్కవాడు కారు కొన్నా, కెరీర్లో పైకి ఎదిగినా.. అవతలివారి మనసులో ఎక్కడో ఒక చిన్న మంట మొదలవుతుంది. వాళ్లకే ఎందుకంత మంచి లైఫ్ దక్కిందని ఇతరుల సంతోషాన్ని చూసి లోలోపల కుతకుతలాడిపోతుంటారు. మెయిన్గా ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తూ చాలామంది ఈ మానసిక సుడిగుండంలో ఇరుక్కుపోతున్నారు. ఈ జెలసీ లూ(Jealous Loop)ప్ అవతలి వ్యక్తికి ఎలాంటి కీడు చేయకపోవచ్చు కానీ.. మనల్ని మాత్రం పూర్తిగా నాశనం చేస్తుందని సైకాలజీ చెబుతోంది.
సైకాలజీ చెబుతున్న ప్రకారం.. మనం ఒకరిని చూసి అసూయపడినప్పుడు మైండ్ ఆ పరిస్థితిని ఒక డేంజర్గా భావిస్తుంది. ఆ వెంటనే బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా రిలీజవుతుంది. దీనివల్ల మెదడులోని ఆలోచనా శక్తి, క్రియేటివిటీ పూర్తిగా చచ్చిపోతాయట.
ఎందుకంటే ఎప్పుడూ ఇతరుల లైఫ్తో మనల్ని పోల్చుకుంటూ ఉండటం వల్ల మన సొంత ఎదుగుదలపై పెట్టాల్సిన ఫోకస్ దెబ్బతింటుంది. ఫలితంగా కొత్త ఐడియాలు రావు సరికదా ఉన్న టాలెంట్ కూడా తగ్గిపోతుంది. అవతలి వాడు హ్యాపీగా ఉన్న ప్రతిసారీ ఇక్కడ వీళ్లు బాధపడటం వల్ల ఇదొక మానసిక నరకంగా మారుతుంది.
ఇదే విషయాన్ని కర్మ సిద్ధాంతం అయితే మరింత సీరియస్గా హెచ్చరిస్తోంది. సనాతన ధర్మం ప్రకారం అసూయ అనేది మనిషి లోని పుణ్య ఫలాన్ని క్షణాల్లో బూడిద చేసే ఒక పెద్ద మంట వంటిది. మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా.. ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేకపోవడం వల్ల క్షీణించిపోతుంది.
కర్మ సిద్ధాంతం ప్రకారం, ఒక వ్యక్తికి సంపద కానీ, సంతోషం కానీ దక్కాయంటే.. అది వారి కష్టార్జితం లేదా ప్రారబ్ధ కర్మల ఫలితం మాత్రమే. దాన్ని చూసి మనం అసూయపడటం అంటే ప్రకృతి న్యాయాన్ని తప్పుపట్టడమే అవుతుంది. ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల మన ఖాతాలో కొత్తగా పాప కర్మలు చేరి, మన భవిష్యత్తు మరింత దిగజారిపోతుంది.
ఈ ‘జెలసీ లూప్’(Jealous Loop) నుంచి బయటపడాలంటే ముందు మన ఆలోచనా సరళిని మార్చుకోవాలి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి ప్రయాణం వేర్వేరుగా ఉంటుంది. పక్కవాడి తోటలో పువ్వులు బాగా పూశాయని అసూయపడటం కంటే, మన తోటలోని మొక్కలకి నీళ్లెలా పోయాలని ఆలోచించడమే తెలివైన పని.
ఇతరుల విజయాలను చూసినప్పుడు మనసారా వారిని అభినందించడాన్ని అలవాటు చేసుకోవాలి. అలా చేసినప్పుడు మన మెదడులో డోపమైన్ అనే మంచి హార్మోన్ రిలీజై, మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
చివరగా గమనించాల్సిన సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే.. ఇతరుల సంతోషాన్ని చూసి ఏడవడం వల్ల వారి సంతోషం అంగుళం కూడా తగ్గదు. కానీ మన ప్రశాంతత మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అందుకే అసూయ అనే విష వలయం నుంచి బయటకు రావాలి. మనకున్న దాంట్లో తృప్తిని వెతుక్కుంటూ, మన సొంత ఎదుగుదలపైన దృష్టి పెట్టాలి. సర్వేజనా సుఖినోభవంతు అనుకుని మన పని మనం చేసుకుంటూ పోవడమే మన మైండ్కు, లైఫ్కు మంచిది.
Womens Team : క్రికెట్ మక్కాలో సరికొత్త చరిత్ర.. లార్డ్స్లో భారత మహిళల జట్టు గ్రాండ్ విక్టరీ..
