Kavitha
తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కల్వకుంట్ల కవిత(Kavitha) కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేశారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రానున్న శ్రీరామనవమి పర్వదినాన ఈ కొత్త పార్టీని, ధర్మగంట గుర్తును అఫీషియల్గా ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి తమ పార్టీ పేరు, ఆ పార్టీకి కేటాయించాల్సిన గుర్తు కేటాయింపుపై దరఖాస్తు చేయగా, దీనిపై జరుగుతున్న జాప్యంపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఈసీ సాధ్యమైనంత త్వరగా క్లియరెన్స్ ఇస్తే, ఈ నెలలోనే పార్టీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆనాడు తండ్రి కల్వకుంట్ల కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదంతో ముందుకు సాగితే.. కవిత(Kavitha) ఇప్పుడు సర్వోదయ తెలంగాణ లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకుని తన పొలిటికల్ పోరాటాన్ని సాగించనున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చారు.
నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో కవితకున్న పట్టును ఆధారంగా చేసుకుని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటాలని కవిత భావిస్తున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలే తమ అజెండా అని చెబుతూ, తన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేవారిని కలుపుకొని ముందుకు వెళ్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పొలిటికల్ విశ్లేషకుల్లో కవిత కొత్త పార్టీ ప్రభావంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీలను తట్టుకుని కేసీఆర్ తనయ కవిత ఎంత వరకూ నిలబడతారనేది ప్రశ్నార్థకంగా ఉన్నా కూడా, ఈ ఏడాది ఆమె జాతక బలం మాత్రం రాజకీయాలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా జాగృతి కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో చెప్పిన దాని ప్రకారం, కవిత నక్షత్రం రీత్యా రానున్న రోజుల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని పండితులు అన్నారు. కవిత జాతకంలో గురు గ్రహ ప్రవేశం వల్ల వచ్చే ఎన్నికల నాటికి శుభ ఫలితాలు లభించనున్నాయని.. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో కవిత పొలిటికల్గా గొప్ప విజయాలు సాధించే ఛాన్స్ ఉందని పంచాంగ కర్తలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి కవిత సిద్ధమవుతున్నారు.
