Rishabh Pant
ఐపీఎల్ లో మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ వేర్వేరు కారణాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా లక్నోలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదు. గతంలో కేఎల్ రాహుల్.. ఇప్పుడు రిషబ్ పంత్(Rishabh Pant)… సీజన్ ముగియడంతోనే కొత్త ఫ్రాంచైజీలను వెతుక్కునే పరిస్థితి వచ్చిందంటే అసలు లక్నో ఫ్రాంచైజీలో ఏం జరుగుతోందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
తాజా వార్తల ప్రకారం మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ లక్నో ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆ ఫ్రాంచైజీలో తాను ఉండలేనంటూ సన్నిహితుల దగ్గర పంత్ వాపోయినట్టు సమాచారం. 2025 వేలంలో పంత్ రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. వెంటనే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది.
లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్ పై చాలా నమ్మకంతో భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ పంత్ మాత్రం తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. కెప్టెన్ గానూ, బ్యాటర్ గానూ ఘోరంగా విఫలమయ్యాడు. గత రెండు సీజన్లలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది.
ఈ పేలవ ప్రదర్శనకు పంత్ తానే బాధ్యత తీసుకున్నాడు. సీజన్ ముగిసిన వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అటు లక్నో ఫ్రాంచైజీ కూడా వెంటనే పంత్ నిర్ణయాన్ని ఆమోదించింది. ఆటగాడిగా కొనసాగుతాడంటూ ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే పంత్ మాత్రం జట్టును వీడేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ట్రేడింగ్ తో పంత్ భారీగా నష్టపోవాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం భారీ కోత పడే అవకాశముంది. ఆర్థికంగా నష్టపోయినా సరే లక్నో జట్టును వీడేందుకు సిద్ధమైనట్టు అర్థమవుతోంది.
ఒకవేళ పంత్ ఢిల్లీకి వెళితే ట్రేడింగ్ లో కుల్దీప్ యాదవ్ లక్నో ఫ్రాంచైజీకి వచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ కూడా పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
గతంలో కెఎల్ రాహుల్ విషయంలోనూ గోయెంకా తీరు విమర్శలకు కారణమైంది. ఓటమి తర్వాత కెప్టెన్లపై మైదానంలోనే సీరియస్ అవుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ కారణంగానే రాహుల్ లక్నో ఫ్రాంచైజీని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఇప్పుడు పంత్(Rishabh Pant) కూడా అదే బాటలో ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పబోతున్నాడు.
