Ireland
ఐర్లాండ్తో తొలి టీ ట్వంటీలో ఊహించని షాక్ తిన్న భారత్ ఇపుడు రెండో మ్యాచ్కు సిద్ధమయింది. సిరీస్ ఓడిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా గెలిచి తీరాలి. లేకపోతే పసికూన చేతిలో సిరీస్ పరాభవం ఎదుర్కొన్న వరల్డ్ ఛాంపియన్స్గా చెత్త రికార్డును చవి చూడాల్సి వస్తుంది.
మొన్న జరిగిన టీ20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్(Ireland) నిర్దేశించిన 182 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా 34 పరుగుల తేడాతో అనూహ్య పరాజయం పాలైంది. సిరీస్ను 1-1తో సమం చేయాలంటే భారత్కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్.
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం మిడిల్ ఓవర్లలో పేలవమైన బౌలింగ్, భారీ లక్ష్యఛేదనలో మిడిల్ ఆర్డర్ వైఫల్యం. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటర్లు సర్దుకోలేకపోవడం. అలాగే డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేకపోవడం కూడా జట్టు పరాజయానికి కారణమైంది.
183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, మిగతా బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ లాంటి కీలక బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేక తక్కువ స్కోర్లకే వెనుదిరగడం భారత్ కొంపముంచింది.
అటు బౌలింగ్లోనూ భారత్ ఫెయిలయింది. ఐర్లాండ్ (Ireland) ఇన్నింగ్స్ 16, 17 ఓవర్లలో భారత బౌలర్లు సుమారు 46 పరుగులకు పైగా సమర్పించుకున్నారు. ఇది ఐర్లాండ్ భారీ స్కోరు సాధించడానికి కారణమైంది. దీంతో తుది జట్టులో మార్పులు జరగనున్నాయి.
తొలి మ్యాచ్లో విఫలమైనా సరే టాప్ ఆర్డర్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బెంచ్ కే పరిమితం కానున్నాడు. అటు బౌలింగ్ విభాగంలో మరింత పట్టు సాధించడానికి ప్రసిధ్ కృష్ణ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకునే యోచనలో మేనేజ్మెంట్ ఉంది.
మరోవైపు తొలి టీ ట్వంటీలో సమిష్టిగా రాణించి భారత్కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్ అదే జోష్ తో సిరీస్ను సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ టకర్, బౌలింగ్లో పేసర్లు, స్పిన్నర్లు కలిసికట్టుగా రాణిస్తుండడంతో ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. అయితే ప్రపంచ ఛాంపియన్ భారత్ కచ్చితంగా ఈ మ్యాచ్లో పుంజుకుని సిరీస్ సమం చేస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.
Rashi Phalalu : కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం.. ఆ రాశి వారికి అనుకోని ప్రయాణాలు
