Annadatha Sukhibhava : రేపే అన్నదాతలకు అసలైన పండగ.. వారి అకౌంట్లలో పడనున్న డబ్బులెంతో తెలుసా?

Annadatha Sukhibhava : రైతాంగమంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన జాయింట్ స్కీమ్‌కు సంబంధించిన మొదటి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది

Annadatha Sukhibhava

ఏపీలోని వ్యవసాయ రంగానికి సపోర్ట్ చేస్తూ, సరికొత్త ఖరీఫ్ సీజన్ సాగు పనుల ప్రారంభ సమయాన రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అదిరిపోయే ఆర్థిక భరోసాను కల్పించబోతున్నాయి. రైతాంగమంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన జాయింట్ స్కీమ్‌కు సంబంధించిన మొదటి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

జూన్ 20వ తేదీ శనివారం రోజు అర్హులైన ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్టుగా రూ. 7,000 చొప్పున పెట్టుబడి సాయం జమ కాబోతోంది. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో… ఈనిధులను రైతుల అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ నిధుల విడుదల కార్యక్రమం శనివారం రెండు వేర్వేరు అంతర్రాష్ట్ర వేదికల నుంచి ఒకేసారి ప్రారంభం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్ యోజన నిధులను పీఎం నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభలో డిజిటల్ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు.

అదే సమయంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరగబోయే అధికారిక కార్యక్రమంలో పాల్గొని .. అన్నదాత సుఖీభవ(Annadatha Sukhibhava )పథకం నిధులను లబ్ధిదారుల అకౌంట్లలోకి బదిలీ చేయనున్నారు. ఈ విడతలో ప్రతి రైతు అకౌంట్‌కు ఏపీ ప్రభుత్వ వాటా అన్నదాత సుఖీభవ కింద రూ.5,000తో పాటు కేంద్ర ప్రభుత్వ వాటా పీఎం కిసాన్ యోజన కింద రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000 ఒకేసారి డైరెక్టుగా జమవుతాయి.

ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాలను కలుపుతూ..అన్నదాతలకు ఏడాదికి రికార్డు స్థాయిలో పెట్టుబడి సాయాన్ని ప్లాన్ చేసింది. ఏపీ ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి అన్నదాత సుఖీభవ(Annadatha Sukhibhava )పథకం కింద ప్రతి ఏటా రూ.14,000 మూడు విడతల్లో ఇస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ద్వారా రూ.6,000 అందిస్తోంది. మొత్తంగా ఏపీలోని ప్రతి రైతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 వరకూ గ్యారెంటీ ఆర్థిక సహాయం అందుతోంది.

ప్రస్తుత అధికారిక గణాంకాల ప్రకారం.. రేపు అంటే జూన్ 20న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 46 లక్షల 85 వేల 838 మంది రైతుల అకౌంట్లలోకి ఏకంగా రూ.3,125.47 కోట్లు జమ కాబోతున్నాయి. దీనిలో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69, 817 ఉండగా, అటవీ భూసాగు హక్కుదారులు (ROFR) మరో 1,16,021 మంది ఉన్నారు.

Annadatha Sukhibhava

రైతులకు విడుదల చేసే ఈ మొత్తం నిధులలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 2,342.92 కోట్ల రూపాయలు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.782.5 కోట్లు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా సరైన సమయంలో ఈ నిధులు డైరెక్టుగా అన్నదాతల చేతికి అందడం వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనిస్తుందని చెప్పొచ్చు.

Peddi : చెర్రీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఓటీటీలోకి పెద్ది ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఆరోజే..

Exit mobile version