Vishaka Steel Plant : విశాఖ ఉక్కు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..9 మంది మృతిపై సుమోటో

Vishaka Steel Plant : జూన్ 8 సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్ విభాగంలో ఈ ప్రమాదం జరిగింది.

Vishaka Steel Plant

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో (Vishaka Steel Plant)జరిగిన ఘోర ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఘాటుగా స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఈ ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి రాబోయే2 వారాల్లోగా పూర్తి రిపోర్టును సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించింది.

జూన్ 8 సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్ విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 1500 డిగ్రీల విపరీతమైన వేడితో ఉన్న లిక్విడ్ స్టీల్ మెటల్‌ను లాడిల్ సాయంతో లిఫ్ట్ చేస్తుండగా, అది ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో ఉక్కుద్రవం అంతా బయటకు లీకవడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోగా, తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతూ పైడిరాజు అనే మరో వ్యక్తి బుధవారం ఉదయం కన్నుమూశారు.

దీంతో మొత్తం ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతులను అప్పారావు, ప్రభాకర్‌రావు, భానుకుమార్, కృష్ణనాగ్, గోల్డ్ కుమార్లతో పాటు కాంట్రాక్టర్లు రమణ, త్రినాథ్, అప్పలరాజులుగా అధికారులు గుర్తించారు. గాయపడిన మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

ఈ ప్రమాద తీవ్రతపై స్పందించిన కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని అనౌన్స్ చేసింది.

అలాగే, చనిపోయిన వారిలో రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు అన్ని రకాల బెనిఫిట్స్ కలుపుకొని రూ.1.72 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ. 45 లక్షల చొప్పున పరిహారం అందుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.

అయితే ఈ ప్రమాదానికి నాసిరకం ముడి పదార్థాలే కారణమన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరిగిన ఇనుము నుంచి వేస్ట్ గ్యాసెస్ తొలగించడానికి అంటే డీగ్యాసింగ్ చేయడానికి సాధారణంగా అల్యూమినియం, హై క్వాలిటీ ఫెర్రోఅలాయ్‌లను వాడుతుంటారు.

Vishaka Steel Plant

కానీ ప్లాంట్‌లో(Vishaka Steel Plant) మాత్రం తక్కువ క్వాలిటీ ఉన్న మెటీరియల్‌నే వాడుతున్నట్లు అక్కడి కార్మికులు చెబుతున్నారు. ఈ నాసిరకం ముడి పదార్థాల వల్ల ఉక్కు లోపల వ్యర్థ వాయువులు ఎక్కువగా తయారై, అవి విపరీతమైన ప్రెజర్‌తో ఒక్కసారిగా బయటకు తన్నుకురావడం వల్లే ఈ బ్లాస్ట్ జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఉక్కు కర్మాగారంలో మరో రెండు ప్రమాదాలు కూడా జరగడం ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఒకవైపు కేంద్రం నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ జరుపుతుండగానే.. బుధవారం ఎస్‌ఎంఎస్‌-2లో, అలాగే గురువారం ఉదయం ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో లాడిల్‌కు రంధ్రం పడి ఉక్కుద్రవం కింద పడిపోయింది.

ఈ రెండు సంఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకున్నా.. ప్లాంట్‌లో సేఫ్టీపై మాత్రం ఆందోళన నెలకొంది.

Cancer : సున్నితమైన మనసు తరచూ మారే మూడ్స్.. కర్కాటకరాశికి ఏ నెంబర్ కలిసి వస్తుంది?

Exit mobile version