Gold Monetization
బంగారం… ధర పెరగడమే తప్ప తగ్గేదేలేదన్న రీతిలో కొంతకాలంగా అందరికీ చుక్కలు చూపిస్తోంది. ఎక్కడ చూసిన గోల్డ్ గురించే చర్చ. సామాన్యుల సంగతి సరేసరి. కొందామనే మాట కూడా రాని పరిస్థితి నెలకొంది.
అదే సమయంలో బంగారం గతంలోనే కొని దాచుకున్న వారందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతోంది. గోల్డ్ మానిటైజేషన్(Gold Monetization) స్కీమ్ను తీసుకురాబోతోంది.
ఇళ్లల్లో, సంస్థల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా.. దానిపై వడ్డీని సంపాదించడానికి వీలు కల్పించే ప్రభుత్వ పథకమే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్.
నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేలా చేయడం, అలాగే విదేశాల నుంచి బంగారం దిగుమతులను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇళ్లల్లో ఉన్న పాత నగలు, బిస్కెట్లు లేదా కడ్డీలను డిపాజిట్ చేయొచ్చు. ఈ డిపాజిట్లపై బ్యాంకులు వార్షిక వడ్డీని చెల్లిస్తాయి.
వడ్డీని భారతీయ కరెన్సీలోనే చెల్లిస్తారు. మీరు డిపాజిట్ చేసిన బంగారం స్వచ్ఛతను పరీక్షించిన తర్వాత, దానికి సమానమైన స్వచ్ఛమైన బంగారాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు. ఈ డిపాజిట్ సర్టిఫికెట్లను చూపి మీరు బ్యాంకుల నుంచి లోన్లు కూడా పొందొచ్చు. ఈ పథకం కింద కనీసం 10 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
ఇంట్లో లాకర్లో పెడితే పెరగని బంగారంపై, ఈ స్కీమ్ ద్వారా నిరంతరం వడ్డీ ఆదాయంగా వస్తుంది. అలాగే ఇంట్లో దొంగతనాలు జరుగుతాయనే భయం ఉండదు. లాకర్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ పథకం ద్వారా లభించే వడ్డీపై ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీ ఎంపికను బట్టి అసలు మొత్తాన్ని తిరిగి బంగారం రూపంలో లేదా నగదు రూపంలో పొందొచ్చు. ఈ పథకంతో ప్రభుత్వానికి వచ్చే మేలును చూస్తే దేశంలో ప్రతి ఏటా భారీగా జరిగే బంగారం దిగుమతులు తగ్గుతాయి.
దిగుమతులు తగ్గడం వల్ల దేశ విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. నిరుపయోగంగా ఉన్న బంగారం ఉత్పాదక మూలధనంగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది. కాగా వచ్చే 15 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
