Cyber Crime : సైబర్ దాడుల ముప్పులో రెండో ప్లేస్‌లో భారత్‌..అయినా శిక్షలు మాత్రం శూన్యం

Cyber Crime : మన దేశంలో సైబర్ నేరాలకు కఠిన శిక్షలు అమలు చేయడంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి.

Cyber Crime

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. దీనిద్వారా అంతర్జాతీయంగా శాంతిభద్రతలకు ,ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ముప్పు ఏర్పడుతుంది. మెటా నివేదిక ప్రకారం, సైబర్ దాడుల ముప్పులో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, డిజిటల్ వినియోగం ఎక్కువగా ఉన్న భారతదేశం రెండో స్థానంలో నిలిచింది.

కేవలం భారతదేశంలోనే ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసానికి(Cyber Crime) గురవుతున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. చాలా దేశాల్లో సైబర్ మోసాలను కట్టడి చేయలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ మోసాలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ సైబర్ నేరగాళ్లను అడ్డుకోవడానికి కొన్ని దేశాలు కఠిన చర్యలు సిద్ధమవుతున్నాయి.

సైబర్ మోసాల్లో దోషులుగా తేలితే మరణ శిక్ష విధించేలా మయన్మార్‌లో బిల్లు తీసుకొచ్చారు. తాజాగా అక్కడ పార్లమెంట్‌లో దీనిని ప్రవేశపెట్టారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్స్‌(Cyber Crime)ను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం సైబర్ నేరాల వల్ల ఇతరుల మరణాలు లేదా తీవ్రమైన నష్టాలు సంభవిస్తే దోషులకు మరణశిక్ష విధిస్తారు.

అటు చైనా, ఉత్తరకొరియా కూడా సైబర్ నేరగాళ్లకు విధించే శిక్షలు కఠినంగానే ఉంటున్నాయి. ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసపూరిత ముఠాలు , తీవ్రమైన సైబర్ నేరాలకు పాల్పడే వారికి చైనా ఉరిశిక్షలు అమలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది.

అలాగే ఉత్తర కొరియాలో ప్రభుత్వ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే లేదా అనధికారికంగా సమాచారాన్ని తస్కరించే సైబర్ నేరాలకు అత్యంత క్రూరమైన జీవిత ఖైదు లేదా మరణశిక్షలు ఉంటాయి.

అయితే భారత్‌లో మాత్రం సైబర్ నేరాలకు కఠిన శిక్షలు లేకపోవడం నేరగాళ్లకు అడ్వాంటేజ్‌గా మారింది. మన దేశంలో సైబర్ నేరాలకు కఠిన శిక్షలు అమలు చేయడంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి.

చాలా సైబర్ మోసాలు మయన్మార్, కంబోడియా, థాయ్‌లాండ్ వంటి విదేశాల నుంచి అంతర్జాతీయ సిండికేట్ల ద్వారా జరుగుతున్నాయి. ఇతర దేశాలతో ఉన్న దౌత్య, న్యాయపరమైన పరిమితుల వల్ల నేరస్థులను పట్టుకోవడం కష్టమవుతోంది.

Cyber Crime

ప్రస్తుత ఐటీ చట్టంలో కఠిన శిక్షలు, నాన్-బెయిలబుల్ సెక్షన్లు విధించడానికి నిబంధనలు సరిగ్గా సరిపోవు. నేరగాళ్లు ఐపీ అడ్రస్‌లు మార్చడం, నకిలీ ఐడీలు, క్రిప్టోకరెన్సీలు వాడడం వల్ల అసలైన నిందితులను గుర్తించి కోర్టులో నేరం రుజువు చేయడానికి తగిన డిజిటల్ సాక్ష్యాలు సేకరించడం కష్టమవుతోంది.

ఈ కారణంగానే సైబర్ కేటుగాళ్లు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సుమారు 13 శాతం దేశాల్లో అధికారిక సైబర్ నేరాల(Cyber Crime) చట్టాలు కఠినంగా లేవు. ఇప్పుడు ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ ఈ చట్టాల్లో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Allu Arjun : ఇకపై 6 నెలలకోసారి బన్నీ ఫ్యాన్ మీట్..ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ

Exit mobile version