Megastar Chiranjeevi
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు , అలాగే 40 ఏళ్లుగా వెండితెరను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తమ నటనా విశ్వరూపంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్న విషయం తెలిసిందే. దీనిని గుర్తించి తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల మహోత్సవంలో.. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ దిగ్గజ నటి మాధురీ దీక్షిత్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని స్వీకరించడం అరుదైన అపురూప ఘట్టంగా మిగిలిపోయింది. ఒక గొప్ప నటుడి పేరుతో ఉన్న అవార్డును మరో నట చక్రవర్తి అందుకోవడం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచడమే కాదు.. అశేష మెగాభిమానులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.
దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చిరంజీవి(Megastar Chiranjeevi)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ చిరు గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు విషెస్ చెబుతున్నారు.
చిరంజీవి ప్రత్యేకత కేవలం ఆయన నటన లేదా డ్యాన్స్లో మాత్రమే లేదన్న విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఒక గొప్ప మానవతావాదిగా సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి ప్రాణదానంతో పాటు చూపును ప్రసాదించిన ఘనత ఆయనదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పొగుడుతున్నారు.
నిజమే సినిమా రంగంలో శిఖరాగ్రాన ఉన్నా సరే, సామాజిక బాధ్యతను మరువకుండా నిరుపేదలకు అండగా నిలబడటం ఆయన విశిష్ఠ వ్యక్తిత్వానికి నిదర్శనమన్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. స్వయంకృషితో పైకి వచ్చి ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచిన చిరు, ఒక తరం ప్రేక్షకులను తన మేజిక్తో అలరించడమే కాకుండా క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ వారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ లక్షణాలే చిరంజీవిని సాధారణ నటుడి నుంచి అసాధారణమైన మెగాస్టార్గా మార్చి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మారారు.
కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి.. భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న పురస్కారాన్ని అందుకోవడం నిజంగా తన జీవితంలో మర్చిపోలేని గౌరవమని అన్నారు. ఎన్టీఆర్ తనకు ఎప్పుడూ స్ఫూర్తిప్రదాత అని, అటువంటి మహనీయుడి పురస్కారం అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని ఎమోషనల్ అయ్యారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ గారి పేరుతో అవార్డులను ఇవ్వడం, తనలాంటి కళాకారులను గౌరవించడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా తెలుగు సినిమా గౌరవాన్ని పెంచేలా తన కృషి కొనసాగుతుందని చెప్పారు. అంతేకాకుండా తనను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు , అభిమానులకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.
Tamilnadu : తమిళనాడులో గెలిచేదెవరు ?…ఉత్కంఠ రేపుతున్న ప్రీ పోల్ సర్వేలు
