Fruits
సూర్యుడు నిప్పులు చెరుగుతున్నప్పుడు మన బాడీలోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోయి మనం త్వరగా అలసిపోతాం. డీహైడ్రేషన్ వల్ల విపరీతమైన వీక్నెస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే.. కేవలం నీళ్లు తాగడమే కాకుండా, శరీరానికి పోషకాలను, నీటిని అందించే కొన్ని రకాల పండ్ల( Fruits)ను కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి.
దీనిలో మొదటిగా చెప్పుకోవాల్సింది కర్బూజ (Muskmelon)పండు గురించి. దీనిలో 90 శాతం కంటే ఎక్కువ నీటి శాతం ఉంటుంది. ఇది బాడీ టెంపరేచర్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ , సీ కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా మంచివి. వేసవిలో వచ్చే మలబద్ధకం వంటి సమస్యలను కూడా కర్బూజ దూరం చేస్తుంది.
ఇక రెండోది అందరికీ ఇష్టమైన మామిడి పండు. మామిడి పండులో విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. మామిడి పండు కేవలం రుచి కోసమే కాదు.. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది . అంతేకాదు మ్యాంగో జీర్ణ ప్రక్రియను సాఫీగా ఉంచుతుందట.
వీటితో పాటు వేసవిలో అరటిపండు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎండల వల్ల వచ్చే నీరసాన్ని పోగొట్టి తక్షణ శక్తిని ఇవ్వడంలో అరటిపండుకు సాటి లేదు. దీనిలో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడుతుంది.
ఇక వేసవిలో మాత్రమే దొరికే తాటిముంజెలు బాడీకి అమృతం వంటివి. ఇవి కడుపులో మంటను తగ్గించడమే కాకుండా, శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తాయి. తాటిముంజెలు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఒక వరం. ఈ పండ్లన్నింటినీ జ్యూస్ రూపంలో కంటే డైరెక్టుగా ముక్కలుగా తినడం వల్ల .. వాటిలోని పీచు పదార్థం మన శరీరానికి పూర్తిగా అందుతుంది.
