Dubai
మధ్యప్రాచ్యంలో యుద్ధ సెగలు రోజురోజుకు ముదురుతూ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. 15 రోజులుగా కొనసాగుతున్న ఈ భీకర పోరు 2026 మార్చి 14వ తేదీకి మరీ ప్రమాదకర మలుపు తీసుకుంది. అమెరికాను డైరక్టుగా సవాల్ చేస్తూ ఇరాన్ తన దాడుల పరంపరను మరింత ఉధృతం చేసింది. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య కేంద్రమైన దుబాయ్(Dubai) , దౌత్యపరంగా కీలకమైన బాగ్దాద్లను టార్గెట్ చేసుకుని ఇరాన్ విరుచుకుపడుతోంది.
గడిచిన 24 గంటల్లోనే దుబాయ్(Dubai)పై ఇరాన్ రెండోసారి దాడికి తెగబడింది. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఒక భవనాన్ని డ్రోన్ శకలాలు ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడి వల్ల ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నా సరే.. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి చిహ్నంగా పేరు బడ్డ దుబాయ్పై ఇలా దాడులు జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఇదే సమయంలో షార్జా తీరంలో ఒక అమెరికన్ ఆయిల్ ట్యాంకర్పై కూడా ఇరాన్ దాడి చేయడం, దానివల్ల ట్యాంకర్లో మంటలు చెలరేగడం వంటి పరిణామాలు చమురు సప్లైపై చాలా ప్రభావం చూపేలా ఉన్నాయి.అయితే ఈ దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.
మరోవైపు ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం క్షిపణి దాడులతో దద్దరిల్లింది. ఎంబసీ ప్రాంగణంలోని హెలిప్యాడ్ను క్షిపణి నేరుగా ఢీకొనడంతో అక్కడ భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద దౌత్య కార్యాలయాల్లో ఒకటైన దీనిపై దాడి జరగడంతో యూఎస్ ప్రభుత్వం వెంటనే రియాక్టయి తన పౌరులకు లెవల్ 4 హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో.. అక్కడి నుంచి పౌరులు తక్షణమే తప్పుకోవాలని సూచించింది.
యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేస్తూ..ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో తన తర్వాత ప్లాన్ అమలు చేస్తోంది. మరోవైపు దీనికి తోడు భూమికి వందల అడుగుల లోతులో ఉన్న భారీ సొరంగాల్లో దాచిన తన ఆయుధ సంపత్తిని వీడియోల ద్వారా చూపిస్తూ ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇటు అమెరికా తన నిఘాను పెంచినా.. ఇరాన్ గెరిల్లా తరహాలో డ్రోన్ దాడులు కొనసాగిస్తుండటంతో రాబోయే 48 గంటలు మధ్యప్రాచ్యానికి చాలా కీలకమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.మొత్తంగా ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి పెను సవాల్గా మారుతున్నాయి.
