Lockdown
ప్రపంచం మెల్లమెల్లగా ఎప్పుడూ లేనంతగా సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతోంది. ఎక్కడో పశ్చిమాసియా దేశాల్లో సాగుతున్న భీకర యుద్ధం, ఈరోజు మన ఇంట్లోని వంట గ్యాస్ సిలిండర్ ధరను, బైక్, కారులో పోయించుకునే పెట్రోల్ రేటును కూడా శాసిస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు.. ఇరాన్ మరోవైపు తలపడుతున్న ఈ ఎడతెరిపి లేని పోరు కేవలం ఆయుధాల యుద్ధంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఒక ఇంధన సంక్షోభంగా మారిపోయి ప్రపంచ నేతలకే కాదు సామాన్యుల గుండెల్లోనే రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది .
ఎందుకంటే అక్కడ యుద్ధం ముదురుతున్న కొద్దీ చమురు సరఫరా గొలుసు తెగిపోతుందనే ఆందోళనతో పాటు, అగ్రదేశాల మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు సామాన్యులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ వంటి దేశాల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే వార్తలు వినిపిస్తుండటం, దానికి తగ్గట్టుగానే పెట్రోల్ , డీజిల్ కొరత కనిపిస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీలలో ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరగడం, చివరకు వాటర్ ట్యాంకర్ల రేటు పెరగడం వంటి వాటితో వాటర్ షార్టేజ్ కూడా పెరిగిపోతుంది. అంతేకాదు గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటల్స్లో రేట్స్ పెంచేశారు. కొన్ని చోట్ల పీజీలు, హాస్టల్లలో గ్యాస్ కొరతతో స్టూడెంట్స్, ఉద్యోగులు అవస్థలు పడుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. దీంతో మున్ముందు రోజులు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. మళ్లీ లాక్ డౌన్( Lockdown) తప్పదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
ఎందుకంటే భారత దేశం తన ఇంధన అవసరాల కోసం ఎక్కువ శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇలాంటి సమయంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల మధ్యనే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రెక్కలు కట్టుకుని పైకి లేస్తున్నాయి. దీని ప్రభావం డైరెక్టుగా పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ ధరలపై పడుతోంది.
కేవలం ఇంధనం ధరలు పెరగడం మాత్రమే కాదు.. రవాణా ఖర్చులు తడిసి మోపెడవ్వడం వల్ల మార్కెట్లో కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు ప్రతి వస్తువు రేటు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. మధ్యతరగతి , తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. ముందు ముందు ఈ తీవ్రత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది.
అందుకే చాలామంది మళ్లీ లాక్డౌన్( Lockdown) వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారు. అయితే గతంలో చూసిన లాక్డౌన్(Lockdown) లు పూర్తిగా ఆరోగ్య సంక్షోభం అంటే కరోనా వంటి మహమ్మారుల వల్ల వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితి భౌగోళిక రాజకీయాలకు సంబంధించింది.
అయితే ఇంధన ధరలు పెరగడం వల్ల లేదా సరఫరా సమస్యల వల్ల.. దేశం మొత్తం లాక్డౌన్ విధించే అవకాశం చాలా తక్కువ. అయితే, యుద్ధం గనుక మరింత ఎక్కువయితే మాత్రం భద్రతా కారణాల వల్ల.. కొన్ని దేశాల్లో రవాణాపై ఆంక్షలు ఉండొచ్చు. అలాగే ఇంధన పొదుపు కోసం ప్రభుత్వాలు కొన్ని కఠినమైన నియమాలను అమలు చేసే ఛాన్స్ ఉంది.
అయితే మన దేశంలో ఇప్పటికే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులు ఉండటం వల్ల వెంటనే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయే పరిస్థితి రాకపోవచ్చు. కానీ ధరల భారం మాత్రం తప్పదని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమైతే కనుక మార్కెట్ స్థిరపడుతుంది. అప్పటివరకు మనం పొదుపు మంత్రం పాటించాలి.
