Pickaxe Mountain
ఒకవైపు భీకర యుద్ధం, దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతున్నా ఇరాన్ మాత్రం అణ్వాయుధాల తయారీ విషయంలో తగ్గేదే లేదన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఒకవైపు తాము ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించడం లేదని చెబుతూనే దానికి తగ్గ ఏర్పాట్లు మాత్రం చేసుకుంటూనే ఉంటోంది.
తాజాగా పికాక్స్ పర్వతం(Pickaxe Mountain) దగ్గరకు పెద్ద ఎత్తున అణు సెంట్రిఫ్యూజులను తరలించడం కలకలం రేపుతోంది. నిజానికి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతానికి అణ్వాయుధాలు లేవు, కానీ ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలు మాత్రం భారీగా కలిగిఉంది.
ఈ యురేనియం నిల్వలు అప్పగించాలన్న డిమాండ్ తోనే అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ అణ్వాయుధాల తయారీ విషయంలో అబద్ధాలు చెబుతోందని అమెరికా తేల్చేసింది. పికాక్స్ పర్వతం(Pickaxe Mountain) సమీపంలో భూగర్భ కేంద్రంగా ఇరాన్ రహస్య అణుస్థావరం ఏర్పాటు చేసుకుందనేది అమెరికా ఆరోపణ.
అమెరికా అత్యంత శక్తివంతమైన బంకర్-బస్టర్ బాంబులకు కూడా అందనంత లోతులో గ్రానైట్ పర్వతాల గుండా భారీ సొరంగ మార్గాలు, అణు కేంద్రాలను ఇరాన్ రహస్యంగా నిర్మిస్తోందని అమెరికా, ఇజ్రాయిల్ ఆరోపిస్తున్నాయి.ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్ సైన్యం దాడులకు పాల్పడిన సమయంలోనే వేలాది అణు సెంట్రిఫ్యూజ్లను ఈ పర్వత ప్రాంతానికి తరలించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
దీనికి సంబంధించి శాటి లైట్ చిత్రాలను కూడా విడుదల చేశాయి. టెహ్రాన్కు దక్షిణంగా దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో, ఇరాన్ ప్రధాన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్ కాంప్లెక్స్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో దీని నిర్మాణం ఉంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం ఈ కేంద్రం నిర్మాణం 2020లో ప్రారంభమైంది.
పర్వతాన్ని తొలిచి లోపలికి వెళ్లేందుకు సుమారు 6 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తున్న నాలుగు భారీ సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు.
ఈ అణు కేంద్రం భూగర్భంలో దాదాపు 100 మీటర్ల లోతున, అత్యంత కఠినమైన గ్రానైట్ రాళ్ల కింద నిర్మించారు. ఇంతటి లోతులో ఉండడం వల్ల అమెరికా సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన బంకర్-బస్టర్ బాంబులు సైతం దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
అయితే దీనిపై ఇరాన్ వాదన మాత్రం వేరేలా ఉంది. తాము ఈ భూగర్భ కేంద్రంలో కేవలం పౌర అణు ఇంధన అవసరాల కోసం ఉపయోగించే ఆధునిక సెంట్రిఫ్యూజులను మాత్రమే తయారు చేస్తున్నామని ఇరాన్ చెబుతోంది. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని పేర్కొంటోంది.
అమెరికా, ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ వాదనను నమ్మడం లేదు. అందుకే దాడులు చేసి దీన్ని ధ్వంసం చేస్తామని ఇటీవలే ట్రంప్ బహిరంగంగా హెచ్చరించారు. తాజాగా ఇరాన్ అణు సెంట్రిఫ్యూజులను తరలించడంతో ఈ ప్రదేశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
CJP : ఆరని నీట్ వివాదపు మంటలు.. ఘర్షణ వాతావరణంలోనూ మానవత్వం మరువని నిరసనకారులు..
