Google : ఆంధ్రప్రదేశ్కు గూగుల్ సంస్థ నుంచి భారీ శుభవార్త అందింది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ను టెక్ రంగంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
గూగుల్ విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ను నిర్మించడానికి 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 50,000 కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఈ భారీ పెట్టుబడిలో 2 బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కోసం కేటాయించనున్నారు.
ఇది డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ను అందిస్తుంది. ఈ డేటా సెంటర్ ఆసియాలో అతిపెద్దదిగా నిలవనుందని, సింగపూర్, మలేషియా, థాయిలాండ్లలో గూగుల్ విస్తరణ ప్రణాళికలో ఇది ఒక ముఖ్యమైన భాగమని రాయిటర్స్ పేర్కొంది.
గతంలోనే ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో ఈ ప్రణాళికలు నిలిచిపోయాయి. ఇప్పుడు నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్పై దృష్టి సారించారని, ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ను ఒక టెక్ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
విశాఖను అంతర్జాతీయ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా మార్చడంలో భాగంగా, ప్రభుత్వం విశాఖపట్నంలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తోందని లోకేష్ ప్రకటించారు.
మొత్తంగా గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ విశాఖలో అడుగుపెట్టడం, భవిష్యత్తులో మరిన్ని టెక్ కంపెనీలు ఇక్కడికి రావడానికి మార్గం సుగమం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.దీంతో టెక్ డెస్టినేషన్గా వైజాగ్ ఫిక్స్ అవడం ఖాయమని అంటున్నారు.