Walk
ఆధునిక జీవనశైలిలో, ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం అనేది సాధారణమైపోయింది. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Glucose Levels) నియంత్రణకు హానికరం. ఇటీవల జరిగిన పలు అధ్యయనాలు, సుదీర్ఘమైన వ్యాయామాల కంటే కూడా, భోజనం తర్వాత చేసే అతి తక్కువ నిడివి గల కదలికలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో స్పష్టం చేస్తున్నాయి.
పరిశోధనల ప్రకారం, మనం భారీ భోజనం చేసిన వెంటనే లేదా ఆ తర్వాత కొంత సమయానికి 10 నుంచి 15 నిమిషాలు చురుకుగా నడవడం(Walk) అది కుదరనపుడు కనీసం నిలబడటం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే, ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో మనం కదిలినప్పుడు, కాళ్లలోని పెద్ద కండరాలు శక్తి కోసం రక్తంలో ఉన్న గ్లూకోజ్ను వెంటనే వినియోగించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల రక్తప్రవాహంలో గ్లూకోజ్ పేరుకుపోవడం గణనీయంగా తగ్గుతుంది.
ఈ చిన్నపాటి కదలిక అనేది, ఆహారం తీసుకున్న తర్వాత వచ్చే చక్కెర స్థాయిల పెరుగుదలను (Postprandial Glucose Spikes) సమర్థవంతంగా నిరోధిస్తుంది. మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, భోజనం తర్వాత చక్కెర స్థాయిలు పెరగడం అనేది హృదయ సంబంధ వ్యాధుల (Cardiovascular Diseases) ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ 10 నిమిషాల నడక, శరీర కణాల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే, కణాలు ఇన్సులిన్కు మరింత సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయి.
చాలా మంది విద్యార్థులు లేదా ఆఫీసులో పనిచేసేవారు భోజనం చేసిన వెంటనే మళ్లీ డెస్క్ వద్ద కూర్చుంటారు. ఈ అలవాటును మార్చుకుని, భోజనం తర్వాత కాసేపు ఆఫీసు కారిడార్లో నడవడం లేదా ఇంటి చుట్టూ తిరగడం(Walk) ద్వారా జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఇది కేవలం రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
దీర్ఘకాలంలో, ఈ చిన్న జీవనశైలి మార్పు.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో లేదా ఇప్పటికే ఉన్నవారికి వ్యాధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎటువంటి అధిక ప్రయత్నం, సమయం అవసరం లేని, అందరూ పాటించగలిగే ఒక ఉత్తమ పరిష్కారం. ఈ సింపుల్ టెక్నిక్ మెదడు చురుకుదనాన్ని కూడా పెంచుతుంది, మధ్యాహ్నం వచ్చే నిద్రాణమైన భావాన్ని (Post-Lunch Slump) నిరోధిస్తుంది.
