Pawan Kalyan
తెలంగాణలో పురపాలక ఎన్నికలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతుండగా, ఈసారి జనసేన పార్టీ కూడా పోటీలోకి దిగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. దీనిలో భాగంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వారాంతంలో (శనివారం, ఆదివారం) తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయాల్సి ఉంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొని అటు జనసేన అభ్యర్థులకు, ఇటు మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించాల్సి ఉంది. అయితే, ఆయన తన ప్రచార పర్యటనను ఊహించని విధంగా రద్దు చేసుకున్నారు. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని, డాక్టర్ల సలహాతో ప్రయాణాలు వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన జనసైనికులను, బీజేపీ అభ్యర్థులను ఈ వార్త నిరాశలో పడేసింది.
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి , పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు మంచి పట్టు ఉంది. ముఖ్యంగా యూత్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావించింది. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను కలిసి మద్దతు కోరడంతో.. సానుకూలంగా స్పందించిన పవన్ ఫిబ్రవరి 7, 8 తేదీలలో తన ప్రచారాన్ని షెడ్యూల్ చేసుకున్నారు. అయితే పవన్ ప్రత్యక్ష ప్రచారానికి రాలేకపోవడం వల్ల ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణలో మొత్తం 336 వార్డుల్లో జనసేన అభ్యర్థులను నిలబడ్డారు. జిల్లాల వారీగా పోటీ చేస్తున్న స్థానాల వివరాలను గమనిస్తే..
కరీంనగర్లో అత్యధికంగా 56 వార్డుల్లో, నిజామాబాద్లో 48, నల్గొండలో 46, మహబూబ్నగర్లో 44, ఆదిలాబాద్లో 39 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే కొత్తగూడెం (22), రంగారెడ్డి (21), వరంగల్ (20), మెదక్ (18), ఖమ్మం (17), మహబూబాబాద్ (5) స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు ఈ ఎన్నికలలో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక ఎన్నికల అధికారులు కూడా వీరి నామినేషన్లను ఆమోదించడంతో ‘గాజు గ్లాస్’ గుర్తు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతోంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్కు వెళ్లే సమయంలో.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రచారం రద్దు కావడం ఇప్పుడు రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు, సినీ స్టార్గా ఆయనకు యువతలో ఉన్న క్రేజ్ , ఆయన మాటలకు ఉన్న ప్రభావం (Impact) ఓట్లను చీల్చడంలో లేదా మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు పవన్ రాలేకపోవడం వల్ల కొన్ని కీలక ప్రభావాలు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు
పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో అలాగే కీలక కార్పొరేషన్లలో యూత్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రసంగిస్తే ఆ యువత ఓట్లు భారీగా బీజేపీ-జనసేన కూటమి వైపు మళ్లేవి. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల ఆ వర్గం ఓటర్లు ఇతర పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది
ఇటు బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాక, పవన్ ప్రచారమే తమ ప్రధాన ఆయుధంగా బీజేపీ భావించింది. ఇప్పుడు పవన్ రాకపోవడం వల్ల కూటమి అభ్యర్థుల నైతిక స్థైర్యం (Morale) కొంత వరకూ దెబ్బతినే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ప్రచారం లేకపోవడం అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు పరోక్షంగా లాభం చేకూర్చొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతం కాకుండా..పవన్ కళ్యాణ్ ప్రచారం అడ్డుకుంటుందని వారు భావించారు, కానీ ఇప్పుడు వారికి ఆ భయం తప్పినట్లయింది.
ఏపీలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ, తెలంగాణలో కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణ్ స్వయంగా లేకపోవడంతో, స్థానిక అభ్యర్థులు తమ సొంత బలంతోనే పవన్ ఇన్ డైరక్ట్ పవర్తో నెట్టుకురావాల్సి ఉంటుంది. ఇది గెలుపు అవకాశాలను కొంత వరకూ ప్రభావితం చేయొచ్చు.
అయితే అధినేత రాక రద్దయినా, క్షేత్రస్థాయిలో జనసైనికులు , వీరమహిళలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంటింటి ప్రచారంలో వేగం పెంచి, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. మొత్తంగా ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో చూడాలి. ఫిబ్రవరి 13న వచ్చే ఫలితాలలో పవన్ ఫ్యాక్టర్ ఎంతవరకు పని చేసిందో, పవన్ గైర్హాజరీ ఎవరికి ప్లస్ అయిందో తేలిపోనుంది.
Religious:మత స్వేచ్ఛా? బలవంతపు మార్పిడా?.. హీట్ పెంచుతున్న సుప్రీంకోర్టు ప్రశ్న
