Heart Attack
ప్రస్తుతం మనిషి జీవితం యంత్రం కంటే వేగంగా పరుగులు పెడుతుంది. ఈ పరుగులో మనం సంపాదన వంటి వాటిపై చూపే శ్రద్ధ, సొంత ఆరోగ్యంపై చూపించడం లేదు.దీంతో చాలా తక్కువ వయసులోనే ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నాం. ముఖ్యంగా గుండెపోటు (Heart Attack) అనేది ఇప్పుడు ఒక సైలెంట్ కిల్లర్లా మారిపోయింది.
నిన్నటి వరకు మనతో ఎంతో ఆరోగ్యంగా గడిపిన వ్యక్తి, ఈరోజు హఠాత్తుగా గుండెపోటు(Heart Attack)తో మరణించారనే వార్త వినడం మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే, గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదని, అది రావడానికి సుమారు 48 గంటల ముందే మన శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ సంకేతాలను మనం కేవలం అలసటగానో , గ్యాస్ సమస్యగానో భావించి వదిలేయడం వల్లే ఈ అకాల మరణాలు సంభవిస్తున్నాయి.
గుండెపోటు(Heart Attack) రావడానికి రెండు రోజుల ముందే వారి శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయట. ఛాతీలో ఏదో తెలియని అసౌకర్యం కలగడమే దీని ప్రధాన లక్షణం. ఇది నొప్పిలా ఉండకపోవచ్చు, కానీ ఛాతీపై ఎవరో పెద్ద రాయి పెట్టి తొక్కినట్లుగా , ఛాతీ బిగుతుగా మారినట్లుగా అనిపిస్తుందట. ఈ నొప్పి క్రమంగా ఎడమ చేయి, వీపు, గొంతు, దవడ వైపునకు వ్యాపిస్తుంది.
చాలా మంది దీనిని సాధారణ కండరాల నొప్పి అని అనుకుంటారు. కానీ ఈ అసౌకర్యం అప్పుడప్పుడు వచ్చి పోతుంటే, అది గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా అందడం లేదని చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక. మునుపటి అధ్యయనాల ప్రకారం, సుమారు 70 శాతం మంది హార్ట్ అటాక్ ఫేషెంట్లు తమకు గుండెపోటు రావడానికి ముందే ఇటువంటి లక్షణాలను గమనించామని చెబుతున్నారు.
ఎటువంటి శారీరక శ్రమ చేయకపోయినా కూడా విపరీతమైన అలసటగా అనిపించడం గుండె జబ్బుల లక్షణం కావొచ్చని అర్దం చేసుకోవాలి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు కానీ కొద్ది దూరం నడిచినప్పుడు కానీ మునుపటి కంటే ఎక్కువగా ఆయాసం రావడం, శ్వాస ఆడకపోవడం వంటివి జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి.
గుండె కండరాలు బలహీనపడినప్పుడు లేదా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీనిని సాధారణ నీరసమని అనుకోకూడదు.
సాధారణంగా ఎండలో ఉన్నప్పుడు , పని చేసినప్పుడు చెమటలు పట్టడం సహజం. కానీ ఏ కారణం లేకుండా, చల్లటి వాతావరణంలో కూడా విపరీతంగా చెమటలు పట్టడం, ముఖ్యంగా ఆ చెమట జిగటగా అనిపించడం గుండెపోటుకు బలమైన సంకేతంగా గుర్తించాలి. గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నప్పుడు రక్తాన్ని పంపింగ్ చేయడానికి గుండె చేసే పోరాటం వల్ల ఇలాంటి చెమటలు పడతాయట.
దీంతో పాటు కొంతమందికి కడుపు ఉబ్బరం, అజీర్ణం, వాంతులు లేదా తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని టాబ్లెట్లు వేసుకుని వదిలేస్తారు. కానీ ఛాతీలో అసౌకర్యంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే అది కచ్చితంగా గుండె సమస్యే కావచ్చని హాస్పిటల్కు వెళ్లాలి.
భారతదేశంలో ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయసు వారిలోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు నరాల వ్యవస్థ దెబ్బతినడంతో.. గుండెలో వచ్చే నొప్పిని మెదడుకు చేరదు. దీనినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు.
అలాగే అధిక బరువు, ధూమపానం ,మద్యపానం అలవాటు ఉన్నవారు, ఎప్పుడూ టెన్షన్ పడేవారు గుండెపోటు ప్రమాదానికి దగ్గరగా ఉంటారు. కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే, అటువంటి వారు రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం కనిపించినా సరే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి ECG , Troponin టెస్ట్ చేయించుకోవాలి. గుండెపోటు విషయంలో గోల్డెన్ అవర్ (మొదటి గంట) అనేది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
వెంటనే వైద్యం అందితే 90 శాతం కేసుల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. సొంతంగా మెడిసిన్స్ వాడటం లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వంటి పనులు ప్రాణాల మీదకు తెస్తాయి.
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం , యోగా చేయడం వంటివి వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆహారంలో ఉప్పు, నూనె , పంచదారను తగ్గించాలి. పచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. స్మోకింగ్ గుండె రక్తనాళాలను గట్టిపడేలా చేస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి.
