Shiva Tandava Stotram
పరమశివుని స్తుతిస్తూ సాగే స్తోత్రాలలో శివ తాండవ స్తోత్రం(Shiva Tandava Stotram) చాలా చాలా ముఖ్యమయినది. ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని శివుని పరమ భక్తుడైన లంకాధిపతి రావణాసురుడు రచించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ స్తోత్రం కేవలం పదాల కలయిక మాత్రమే కాదని, దీని వెనుక ఒక అద్భుతమైన ధ్వని శాస్త్రం దాగి ఉందని సైన్స్ చెబుతోంది.
విజ్ఞాన శాస్త్రం చెబుతున్న ప్రకారం ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలా ఈ స్తోత్రంలోని సంస్కృత అక్షరాల అమరిక వల్ల..అవి సృష్టించే లయ మనిషి బాడీలోని నాడీ వ్యవస్థపై లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కానీ, పఠిస్తున్నప్పుడు కానీ మనిషి మెదడులో ఒక రకమైన ప్రకంపనలు మొదలవుతాయి. ఆ ప్రకంపనల వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి, మనిషి వర్తమానంలోకి వస్తారు.
సాధారణంగా మనం ఎవరైనా సరే ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడులో బీటా తరంగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ స్తోత్రంలోని జటాటవీ గలజ్జల ప్రవాహపావితస్థలే వంటి కఠినమైన పదాలతో పాటు లయబద్ధమైన పదాలను విన్నప్పుడు మన మెదడు నెమ్మదిగా ఆల్ఫా స్థితికి చేరుకుంటుందని పరిశోధనలు చెప్పాయి.
ఈ ఆల్ఫా స్థితిలో మనిషికి ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుందట. ఈ స్తోత్రాన్ని రావణాసురుడు ఒక ప్రత్యేకమైన ఛందస్సులో కూర్చడం వల్ల, స్తోత్రం పఠించేటప్పుడు శ్వాసక్రియ కూడా క్రమబద్ధంగానే సాగుతుంది. అంటే ఇది ఒక రకమైన ప్రాణాయామంలా పనిచేస్తుందన్న మాట. దీని వల్ల శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు పెరగడంతో పాటు, రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందట.
అందుకే ఈమధ్య కాలంలో సౌండ్ థెరపీ లేదా ధ్వని చికిత్సకు ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుంది. అయితే ప్రాచీన భారతదేశంలో మన ఋషులు ఈ ధ్వని శక్తిని వేల ఏళ్ల క్రితమే గుర్తించినట్లు చరిత్ర చెబుతోంది. మొత్తంగా విశ్వం మొత్తం ఒక ప్రకంపన (Vibration) అని, ఆ ప్రకంపనలే శివ తాండవమని ఈ స్తోత్రం మనందరికీ గుర్తు చేస్తుంది.
అందుకే ఈ స్తోత్రం పఠించేటప్పుడు మనలో మనకు తెలీకుండానే ఓ రకమైన ఉత్సాహం, ధైర్యం కలుగుతాయి. శివ తాండవ స్తోత్రం(Shiva Tandava Stotram) కేవలం ఆధ్యాత్మిక అంశం మాత్రమే కాదు.. మనిషి అంతరాత్మను, మెదడు పనితీరును కూడా మెరుగుపరిచే ఒక గొప్ప సైన్స్ అని తేలింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా మన సంస్కృత శ్లోకాల వల్ల కలిగే మానసిక ప్రయోజనాలపై పరిశోధనలు చేస్తున్నారు. అటువంటి పరిశోధనలకు మన శివ తాండవ స్తోత్రం ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
