Vinayaka Chavithi
భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతున్నాయి. విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడిని పూజించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది వినాయక చవితి(Vinayaka Chavithi)ని 2025 ఆగస్టు 27న అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడానికి తెలుగు ప్రజలు సన్నద్ధమవుతున్నారు.
ఈ ఏడాది చవితి తిథి ఆగస్టు 26, 2025న సాయంత్రం 4:32 గంటలకు మొదలవుతుంది, అయితే ఆగస్టు 27, 2025న మధ్యాహ్నం 3:20 గంటలకు ముగుస్తుంది. వినాయకుడి (Vinayaka Chavithi)పూజకు అనుకూలమైన సమయం (శుభ ముహూర్తం) ఆగస్టు 27న ఉదయం 11:32 నుంచి మధ్యాహ్నం 1:44 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
వినాయక చవితి(Vinayaka Chavithi) రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి, కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, పచ్చని మామిడి ఆకులు, పసుపు పూల తోరణాలతో అలంకరిస్తారు. వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, మోదకాలు, మరియు ఇతర రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఈ పూజలో గరిక, 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజించడం ఒక ప్రధాన భాగం. వినాయక చవితి పూజా విధానం కింద ఇవ్వబడింది.
పూజకు ముందు, దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, ముందుగా పసుపు గణపతిని పూజిస్తారు. ఆ తర్వాత, వినాయకుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఈ ఆకుల పేర్లు వాటిని సమర్పించే క్రమం ఈ విధంగా ఉంటుంది.
మాచీ పత్రం – మాచిపత్రి..బృహతీ పత్రం – వాకుడాకు.. బిల్వ పత్రం – మారేడు..దుర్వా పత్రం – గరిక..బదరీ పత్రం – రేగు..దత్తూర పత్రం – ఉమ్మెత్త ..అపామార్గ పత్రం – ఉత్తరేణి.. తులసి పత్రం – తులసి..చూత పత్రం – మామిడి..కరవీర పత్రం – గన్నేరు..విష్ణు క్రాంత పత్రం – విష్ణు క్రాంత..దాడిమీ పత్రం – దానిమ్మ..దేవదారు పత్రం – దేవదారు..మరువక పత్రం – మరువక..సింధువార పత్రం – వావిలి..జాజీ పత్రం – జాజి..గండలి పత్రం – గండలి..శమీ పత్రం – జమ్మి..అశ్వత్థ పత్రం – రావి..అర్జున పత్రం – తెల్లమద్ది..అర్క పత్రం – జిల్లేడు
ఈ పత్రాలతో పూజించడం వల్ల ఆరోగ్యంతో పాటు, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పూజ అనంతరం, వినాయక కథను పఠించి, ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరిస్తారు. ఈ పండుగతో అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయని భక్తుల నమ్మకం.