Cricket
సాధారణంగా క్రికెట్ (Cricket)మ్యాచ్ టికెట్లకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ (Cricket)అయినా వేగంగానే అమ్ముడవుతాయి. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ లు అంటే చెప్పక్కర్లేదు.. ఐపీఎల్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. కొంతకాలంగా టీ20 మ్యాచ్ టికెట్లే గంటల వ్యవధిలో అమ్ముడవడం చూసాం. కానీ ఇప్పుడు భారత్ , న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్లు కేవలం 8 నిమిషాల్లోనే ఖతమ్ అయ్యాయి.
టీ20 మ్యాచ్(Cricket) టికెట్లు గతంలో గంట లేదా రెండు గంటల్లో అమ్ముడైన సందర్భాలున్నాయి. అయితే వన్డే మ్యాచ్ టికెట్లు ఈ స్పీడ్ అమ్ముడవడం రికార్డుగానే చెప్పాలి. దీనికి కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే.. ఎందుకంటే రోకో జోడీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు, ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్టులకు వీరిద్జరూ గుడ్ బై చెప్పేశారు.
వీరి టెస్ట్ రిటైర్మెంట్ కు కారణాలు ఏమైనా కానీ భారత క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చారు. అప్పటి నుంచి వన్డే సిరీస్ లో మాత్రమే వీరిద్దరూ కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు వీరి ఆటను చూసేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
పైగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 7 నెలల గ్యాప్ తో ఆసీస్ టూర్ లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ , కోహ్లీ అదరగొట్టారు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ దుమ్మురేపారు. అంతేకాదు దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బరిలోకి దిగి శతకాలు బాదారు.
ఈ సూపర్ ఫామ్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2027 వన్డే ప్రపంచకప్(Cricket) వరకూ కేవలం వన్డేల్లో మాత్రమే రోకో జోడీ కనిపించనుండడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వారి ఆటను మిస్ అవ్వకూడదని ఉవ్విళ్లూరుతున్నారు.
వారి ఉత్సాహం ఫలితమే వడోదర వేదిక జనవరి 11న జరిగే తొలి వన్డే టికెట్లు కేవలం 8 నిమిషాల్లో అమ్ముడైపోయాయి. దీంతో రోహిత్ , కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ క్రేజ్ ఇదీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మిగిలిన రెండు వన్డేలకు సైతం ఇదే తరహా క్రేజ్ నెలకొంది. కాగా జనవరి 11 నుంచి వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనున్నాయి.
