Dhruv Jurel
దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఎంపికైన పలువురు యువ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ లో సత్తా చాటారు. సిరీస్ డ్రాగా ముగిసినప్పటికీ రెండో అనధికారిక టెస్టులో మాత్రం ధృవ్ జురెల్ (Dhruv Jurel)అదరగొట్టాడు. ఒకటి కాదు రెండు ఇన్నింగ్స్ లోనూ శతకాలు బాదేశాడు. స్టార్ బ్యాటర్లు రాహుల్, పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్ విఫలమైన పిచ్ పై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్ కు ఎంత విలువ ఉంటుండో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఏ కేవలం 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో నిలబడి సెంచరీ బాదాడు. జట్టుకు మంచి స్కోర్ అందించడంలో జురెల్(Dhruv Jurel) దే కీలకపాత్ర. ఎక్కువ సేపు తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ లోనూ మరోసారి శతకం చేశాడు.
కెప్టెన్ పంత్, హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలతో భారత్ ఏ జట్టుకు భారీస్కోర్ అందించాడు. సాధారణంగా రెడ్ బాల్ క్రికెట్ తోనే ఆటగాడి నైపుణ్యం తెలుస్తుంది. జురెల్ అటు వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొడుతూనే రెడ్ బాల్ క్రికెట్ లోనూ తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికా ఏతో రెండో అనధికారిక టెస్టులో జురెల్ తొలి ఇన్నింగ్స్ 132, రెండో ఇన్నింగ్స్ 127 రన్స్ చేశాడు.
రెండు ఇన్నింగ్స్ లలోనూ అతను నాటౌట్ గా నిలిచాడు. సఫారీ పేసర్లు బౌన్సర్లతో ఇబ్బంది పెట్టినా చక్కని బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. జురెల్ సూపర్ ఫామ్ ఇప్పుడు కోచ్ గంభీర్ కు తలనొప్పిగా మారింది. వరుసగా రెండు సెంచరీలతో తుది జట్టులో అతనికి చోటు ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చాడు. ఇంతకుముందు విండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ జురెల్ శతకం బాదాడు. ఇప్పుడు వరుసగా రెండు శతకాలు చేసిన తర్వాత తుది జట్టులో ప్లేస్ ఇవ్వకుంటే మాత్రం గంభీర్ పై తీవ్ర విమర్శలు రావడం ఖాయం.
దేశవాళీ క్రికెట్ ఫామ్ ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందని గతంలో పలుసార్లు చెప్పిన గంభీర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ పంత్ కు బ్యాకప్ వికెట్ కీపర్ జురెల్ ను ఎంపిక చేసింది. పంత్ గాయం నుంచి కోలుకుని వచ్చేయడంతో తుది జట్టులో చోటు కష్టమే అనుకున్నారు. అయితే వరుసగా రెండు సెంచరీలు బాదిన జురెల్ ను ఇప్పుడు నితీశ్ రెడ్డి ప్లేస్ లో స్పెషలిస్ట్ బ్యాటర్ గా తీసుకునే అవకాశముంది.
నిజానికి భారత టెస్ట్ జట్టులో నితీశ్ రెగ్యులర్ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే సౌతాఫ్రికాతో సిరీస్ సొంతగడ్డపై జరుగుతుండడం, స్పిన్ పిచ్లపై నితీశ్ లాంటి మీడియం పేస్ ఆల్ రౌండర్ అవసరం లేకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ప్లేస్ కు జురెల్ ఎర్త్ పెట్టాడని భావిస్తున్నారు.
