IND vs PAK
టీ 20 ప్రపంచకప్ మొదలైపోయింది. ఈ సారి ఆట కంటే కొన్ని ఇతర అంశాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడం స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్ తో మ్యాచ్ బహిష్కరించడం వంటివి. ముఖ్యంగా పీసీబీ తీసుకున్న నిర్ణయంతో ఐసీసీకి , అనుబంధ క్రికెట్ బోర్డులకు భారీ నష్టం వాటిల్లనుంది. ఐసీసీ ఎంత చెప్పినా కూడా పాక్ క్రికెట్ బోర్డు మాత్రం నిర్ణయం మార్చుకోలేదు.
అయితే ఇప్పుడు పీసీబీ భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ విషయంలో యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. దీనికి కారణం శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తేనని తెలుస్తోంది. నిజానికి భారత్, పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డులకు ఆర్థికంగా నష్టం ఖాయం. ఐసీసీ, బీసీసీఐ ఈ నష్టాన్ని భరించే స్థితిలోనే ఉన్నప్పటకీ.. పాక్ బోర్డు, లంక క్రికెట్ బోర్డు మాత్రం ఆ నష్టాలను ఎదుర్కొనే పరిస్థితిల్లో లేవు.
ఇప్పటికే శ్రీలంక క్రికెట్ కూడా ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇటీవలే లంక క్రికెట్ బోర్డు లేఖ రాసింది. భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే పీసీబీతో లంక క్రికెట్ బోర్డుకు చక్కని సంబంధాలున్నాయి.
పాక్ లో క్రికెట్ ఆడేందుకు ఎవ్వరూ ముందుకు రానప్పుడు లంక క్రికెట్ బోర్డు తమ జట్టును అక్కడకి పంపించింది. పలు సార్లు క్లిష్ట పరిస్థితుల్లో పాక్ కు అండగా నిలిచింది. ఇదే స్నేహంతో లంక క్రికెట్ బోర్డు పీసీబీకి ప్రత్యేకంగా లేఖ రాసింది. పీసీబీ తీసుకున్న నిర్ణయంతో ఐసీసీ, బీసీసీఐకి పెద్దగా నష్టం జరగదని, కానీ ఆతిథ్య హోదాలో చిన్న బోర్డుగా ఉన్న తమపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించింది.
లంక క్రికెట్ బోర్డు రాసిన లేఖపై పీసీబీ కూడా సానుకూలంగానే స్పందించింది. తమకు చాలాసార్లు అండగా నిలిచిన లంక బోర్డు మాటను గౌరవించాలని భావిస్తోంది. ఈ క్రమంలో వారి రిక్వెస్టును పరిగణలోకి తీసుకుంది. తమ ప్రభుత్వంతో దీనిపై మరోసారి చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఒకవేళ భారత్ తో మ్యాచ్ పాక్(IND vs PAK) బాయ్ కాట్ చేస్తే దాదాపు రూ.2200 కోట్లు నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని ఐసీసీ భారత్, లంక, పాక్ బోర్డులకు అందజేసే రెవెన్యూ వాటాలో మైనస్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే లంక బోర్డు పీసీబీకి రిక్వెస్ట్ పెట్టింది.
