U19 World Cup : యువ ఛాంపియన్లకు నజరానా..రూ.7.5 కోట్లు ప్రకటించిన బీసీసీఐ

U19 World Cup : బీసీసీఐ కేవలం ప్రశంసలే కాకుండా భారీ నజరానాను అందజేయబోతోంది. అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టును రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది.

U19 World Cup

అండర్ 19 క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్ మరోసారి విశ్వవిజేతలుగా నిలిచింది. ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో యువ భారత్ ఆటతీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బీసీసీఐ కేవలం ప్రశంసలే కాకుండా భారీ నజరానాను అందజేయబోతోంది. అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టును రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది.

ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువేనని, దేశం గర్వించేలా ఆడి ఛాంపియన్లుగా నిలిచారని బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా ప్రశంసించారు. భారత క్రికెట్ భవిష్యత్తును శాసించే వీరంతా అత్యుత్తమ ఆటతీరుతో ట్రోఫీ గెలిచారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా వారి సాధించిన విజయానికి గుర్తింపుగా బీసీసీఐ తరపున రూ.7.5 కోట్లు నజరానా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే భారత్ అండర్ 19 జట్టును సత్కరించి , నగదు బహుమతి అందజేస్తామని దేవజీత్ సైకియా వెల్లడించారు. కాగా బీసీసీఐ ప్రకటించిన ఏడున్నర కోట్ల రూపాయలను ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి పంచుతారు.

ఇదిలా ఉంటే ప్రపంచకప్ గెలిచినందుకు ఐసీసీ నుంచి భారత జట్టుకు ఎలాంటి ప్రైజ్ మనీ లభించదు. ఎందుకంటే అండర్ 19 వరల్డ్ కప్ ను ఐసీసీ క్రికెట్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద మాత్రమే పరిగణిస్తుంది. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేసేందుకు, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకే ఈ టోర్నీ ఏర్పాటు చేసింది.

U19 World Cup

అందుకే ఈ టోర్నీలో పాల్గొనే ఏ జట్టుకు కూడా ప్రత్యేకంగా నగదు బహుమతులు అందించరు. అయితే ఐసీసీ తన వార్షిక ఆదాయంలో కొంత మొత్తాన్ని ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు డెవలప్ మెంట్ ఫండ్స్ రూపంలో అందజేస్తుంది. ఈ ఫండ్స్ ను యువ ఆటగాళ్ల ట్రైనింగ్ కు, టోర్నీల నిర్వహణకు వాడుకోవాలని సూచిస్తుంది. దీంతో మళ్లీ ప్రత్యేకంగా ప్రైజ్ మనీ ఇస్తే అది డబుల్ రివార్డు కిందకు వస్తుంది. అందుకే ఎలాంటి నగదు పురస్కారాలు ఐసీసీ ఇవ్వదు.

సీనియర్ మెన్స్ టోర్నీలకు మాత్రం కోట్లాది రూపాయలను ప్రైజ్ మనీగా అందజేస్తుంది. అటు బీసీసీఐ మాత్రం భారత జట్లు ఏ కేటగిరీలో ఐసీసీ ట్రోఫీలు గెలిచినా భారీ మొత్తంలో నగదు పురస్కారాలు అందజేస్తుంటుంది. 2022లో అండర్ 19 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రతీ ప్లేయర్ కు రూ.40 లక్షలు అందజేసింది. అలాగే అండర్ 19 మహిళల జట్టుకు కూడా రూ.5 కోట్ల నజరానా ఇచ్చింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version