IND vs SA: సఫారీలను తిప్పేశారు..  విజయం దిశగా భారత్

IND vs SA: జడేజాతో పాటు కులీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా తిప్పేయడంతో సౌతాఫ్రికా రెండోరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లకు 93 పరుగులు చేసింది.

IND vs SA

భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండోరోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీ ఆధిక్యం సాధిస్తుందనుకున్న టీమిండియా 189 పరుగులకే పరిమితమైంది. గాయంతో గిల్ రిటైర్డ్ హర్ట్ కావడం దెబ్బతీసింది. అటు 30 పరుగుల ఆధిక్యం రావడం కాస్త అడ్వాంటేజ్. రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు తిప్పేయడంతో సౌతాఫ్రికా(IND vs SA) 7 వికెట్లు కోల్పోయింది. దీంతో ఒకేరోజు మొత్తం 17 వికెట్లు నేలకూలాయి.

రెండోరోజు 37/1 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ రెండో వికెట్ కు 57 పరుగులు పార్టనర్షిప్ నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక్కడ నుంచి టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. గిల్ రిటైర్డ్ హర్ట్ వెనుదిరిగిన తర్వాత పంత్, రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

స్పిన్నరకు అనుకూలిస్తున్న పిచ్ పై పరుగులు చేయడం కష్టంగా మారింది. జడేజా, పంత్ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 189 పరుగులకు ఆలౌటవగా.. రాహుల్ 39 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో హార్మర్ 4, జెన్సన్ 3 వికెట్లు తీశారు.

IND vs SA

30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్లు బెంబేలెత్తించారు. ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరినీ క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. రికెల్టన్, మార్క్రమ్,ముల్లర్ , జోర్జి, స్టబ్స్, వెర్రిన్నే త్వరగానే ఔటయ్యారు. ముఖ్యంగా జడేజా తన స్పిన్ మ్యాజిక్ తో సఫారీ బ్యాటర్లను తిప్పేశాడు. బంతి ఎటు వస్తుందో కూడా తెలియక సౌతాఫ్రికా బ్యాటర్లు వికెట్లు కాపాడుకునేందుకు నానాతంటాలు పడ్డారు.

జడేజాతో పాటు కులీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా తిప్పేయడంతో సౌతాఫ్రికా రెండోరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓవరాల్ గా సౌతాఫ్రికా(IND vs SA) 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజే మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతానికి భారత్ విజయం దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది.

మూడోరోజు ఎంత త్వరగా సఫారీలను ఆలౌట్ చేస్తే భారత్ కు అంత విజయావకాశాలుంటాయి ఎందుకంటే నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. సౌతాఫ్రికా జట్టులో స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, ముత్తుసామి, హార్మర్ కూడా ఫామ్ లో ఉండడంతో భారత్ బ్యాటర్లు ఛేజింగ్ లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version