INDW vs SLW: లంకపై భారత్ క్లీన్ స్వీప్.. 5-0తో సిరీస్ కైవసం

INDW vs SLW: హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన షెఫాలీ వర్మ కేవలం 5 పరుగులకే ఔటవగా...కమిలిని 12 , హ్యార్లిన్ డియోల్ 13 పరుగులు వెనుదిరిగారు.

INDW vs SLW

సొంతగడ్డపై భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరల్డ్ కప్ విజయం తర్వాత ఆడిన తొలి టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్(INDW vs SLW) చేసింది. శ్రీలంకపై 5-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి టీ ట్వంటీలో కాస్త పోరాడినా లంకకు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో భారత్ తుది జట్టులో పలు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్స్ స్మృతి మంధాన, రేణుకా సింగ్ కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహా రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ తోనే కమిలిని అరంగేట్రం చేసింది. గత మూడు మ్యాచ్ లలో అదరగొట్టిన భారత కీలక బ్యాటర్లు చివరి టీ20లో విఫలమయ్యారు.

హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన షెఫాలీ వర్మ కేవలం 5 పరుగులకే ఔటవగా…కమిలిని 12 , హ్యార్లిన్ డియోల్ 13 పరుగులు వెనుదిరిగారు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయినప్పటకీ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించని ఆమె చివరి మ్యాచ్ లో మాత్రం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లంక బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ హాఫ్ సెంచరీ సాధించింది.

రిఛా ఘోష్ 5, దీప్తి శర్మ 7 పరుగులకే ఔటవగా.. అమన్ జోత్ , హర్మన్ కు చక్కని సపోర్ట్ ఇచ్చింది. వీరిద్దరూ ఆరో వికెట్ కు కేవలం 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ 68 (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులకు ఔటయింది. దీంతో భారత్ స్కోరు 160 దాటడం కష్టమే అనిపించింది. అయితే చివర్లో హైదరాబాదీ ప్లేయర్ అరుంధతి రెడ్డి మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 27 నాటౌట్ (4 ఫోర్లు, 1 సిక్సర్ ) చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్హరి 2 , రష్మిక 2 , ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టారు.

INDW vs SLW

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు(INDW vs SLW)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (2) రెండో ఓవర్లోనే వెనుదిరిగింది. అయితే మరో ఓపెనర్ హాసిని పెరీరా, దులానీ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హాసిని, దులానీ రెండో వికెట్ కు 56 బంతుల్లో 79 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అమన్ జోత్ కౌర్ విడగొట్టింది. దులానీ 50 ( 8 ఫోర్లు ) పరుగులకు ఔట్ చేసింది.

ఇక్కడ నుంచీ శ్రీలంక(INDW vs SLW) వరుసగా వికెట్లు కోల్పోయింది. హాసిని దూకుడుగా ఆడుతున్నా మరోవైపు మిగిలిన బ్యాటర్లు వరుసగా ఔటయ్యారు. హాసిని పెరీరా 65 (42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ ) పరుగులకు ఔటవడంతో లంక ఓటమి ఖాయమైంది. చివర్లో భారత ఫీల్డర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేసి లంకను కట్టడి చేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, స్నేహా రాణా, శ్రీచరణి, అమన్ జోత్ కౌర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version