T20 World Cup: భారత్‌కు మా జట్టు వెళ్లదు..ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ

T20 World Cup: ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ

 T20 World Cup

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్ నుంచి ఆ దేశ క్రికెటర్లను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ముస్తాఫిజుర్ రహమాన్ ను విడుదల చేయాలని కోల్ కత్తా ఫ్రాంచైజీకి ఆదేశాలివ్వడం, , వెంటనే కేకేఆర్ కూడా అతన్ని జట్టును రిలీజ్ చేసేయడం జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది. వచ్చే టీ20 ప్రపంచకప్ ( T20 World Cup) కోసం తమ జట్టు భారత్ కు వెళ్లదని స్పష్టం చేసింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్ ల వేదికలను భారత్ నుంచి మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఉన్నట్టు తెలుస్తోంది. ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించారని ప్రకటన వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ రంగంలోకి దిగారు. భారత్ లో ఆడమంటూ వెంటనే ఐసీసీకి లేఖ రాయాలని తమ దేశ క్రికెట్ బోర్డును ఆదేశించారు.

T20 World Cup

రాజకీయ కారణాలతోనే ముస్తాఫిజుర్ ను తప్పించారని, ఇది బంగ్లా ఆటగాళ్లను అవమానించడమేనని నజ్రుల్ ఆరోపిస్తున్నారు. ఒక స్టార్ ప్లేయర్ కు భారత్ లో రక్షణ లేనప్పుడు మొత్తం జాతీయ జట్టు పర్యటించడం క్షేమం కాదంటూ చెబుతున్నారు. నజ్రుల్ ఆదేశాలతో బంగ్లా క్రికెట్ బోర్డు ఆఘమేఘాల మీద ఐసీసీకి లేఖ రాసింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని కోరింది. దీనిపై ఐసీసీ ఇంకా స్పందించలేదు. ఇటీవల జరిగిన మినీ వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ ను రూ.9.2 కోట్లతో కొనుగోలు చేసింది. అప్పటికి బంగ్లాలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. వేలం ముగిసిన కొన్ని రోజులకు హిందువులపై దాడులు పెరగడం, నలుగురు హత్యకు గురవడం వంటి పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ లో ఆడించొద్దంటూ పలు రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. దీంతో పరిస్థితి చేయి దాటకూడదన్న ఉద్దేశంతో బీసీసీఐ అతన్ని రిలీజ్ చేయాలని ఆదేశాలిచ్చింది.

మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి (T20 World Cup) రాసిన లేఖపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఇష్టానుసారం మ్యాచ్ల వేదికలను మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. టోర్నమెంటు ఇంకా నెలరోజుల సమయమే ఉండని, ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. బంగ్లాదేశ్ తో ఆడే ఇతర జట్ల గురించి కూడా ఆలోచించాలని, ఇప్పటికే వారి విమాన టికెట్లు, బస చేసే హోటల్స్, ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయని గుర్తు చేసింది.

Bhogapuram Airport :ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం ఎయిర్ పోర్ట్..దీని వల్ల విశాఖకు కలిసొచ్చే అంశాలేంటి?

Exit mobile version