UPI Service
భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు(UPI Service )ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయాయి. జేబులో రూపాయి లేకపోయినా స్మార్ట్ఫోన్ ఉంటే చాలు అనే ధీమాను కల్పించేలా చేశాయి. అయితే సోషల్ మీడియాలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. వెయ్యి రూపాయలకు మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్పై సర్వీస్ ఛార్జీలు పడతాయని వార్తలు రావడంతో సామాన్యులు టెన్షన్ పడుతున్నారు.
అయితే ఈ ప్రచారంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సాధారణ వినియోగదారులు జరిపే వ్యక్తుల మధ్య (P2P) కానీ వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) జరిగే ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఛార్జీలు లేవని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యానికి విరుద్ధంగా జరుగుతున్న ఇటువంటి రూమర్లను నమ్మొద్దని ప్రభుత్వం పదేపదే కోరుతోంది.
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సాధారణ వినియోగదారులు.. రోజుకు లక్ష రూపాయల వరకు ఫ్రీగానే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. బిజినెస్ అకౌంట్లకు ఈ పరిమితి ఐదు లక్షల రూపాయల వరకు ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడానికి వీటికోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది.
అయితే ఇక్కడ వినియోగదారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.ఎలక్ట్రికల్ బిల్, గ్యాస్ బిల్లులు లేదా ఇతర థర్డ్ పార్టీ సేవల కోసం యూపీఐని వాడుతున్నప్పుడు కొన్నిసార్లు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది వినియోగదారులలో ఒక రకమైన అనుమానాన్ని కలిగిస్తోంది. మొదట ఉచితంగా అలవాటు చేసి, ఆ తర్వాత మెల్లగా బాదుడు మొదలుపెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు డిజిటల్ యుగం అని క్యాష్ లెస్ ట్రాన్జాక్షన్స్కు ప్రోత్సాహకం అని చెబుతూనే, మరోవైపు పరోక్షంగా కొన్ని సర్వీసులపై ఛార్జీలు వేయడం ప్రజలను అసంతృప్తికి గురిచేస్తోంది.
ఇక ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు వంటి సర్వీసుల(UPI Service)ను అందించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తోంది. బ్యాంకులు , పేమెంట్ యాప్స్ ఈ సేవలను ఉచితంగా అందించడం వల్ల వాటిపై నిర్వహణ భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించడానికి భవిష్యత్తులో ఏవైనా మార్పులు చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా కూడా , ప్రస్తుతానికి మాత్రం యూపీఐ పూర్తిగా ఉచితం.
