Kaleshwaram
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అసలు ఆట కాళేశ్వరం (Kaleshwaram)ప్రాజెక్టుపైనే జరుగుతోంది. కమిషన్ నివేదిక సిద్ధంగా ఉండగా, దాన్ని బయటపెట్టడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే కాకుండా… బీఆర్ఎస్ పార్టీకి అసలు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఈ నివేదిక బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల ఆటకే గడ్డి పెట్టే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్లో… హరీష్ రావు కేసీఆర్ అంటే కాటన్ అంటూ బాణం విసరడం, వదిలిన తూటా కాదు. ఇది కమిషన్ నివేదిక ముందే ఆ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారిప్పుడు రాజకీయ విశ్లేషకులు.
కాళేశ్వరం(Kaleshwaram) నిర్మాత కేసీఆర్ను… గోదావరి జిల్లాల గుండెల్లో నిలిచిపోయిన బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్తో పోల్చిన హరీష్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్దదుమ్ము రేపుతున్నాయి. కమిషన్ ఆవిష్కరించబోయే అవకతవకల డేటాను ఎదుర్కొనేందుకు ముందస్తు సెటప్ వేస్తున్నారా? లేక నిజంగా కేసీఆర్ వేసిన ప్రాజెక్టులపై గౌరవాభివృద్ధేనా? అనే డౌట్లు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి.మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వం వేసిన కాళేశ్వరం ఇప్పటికి ఒక్క మోటారు పంప్ కూడా పని చేయలేని స్థితిలో ఉండగా, ఎంత గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించడం వెనుక మాస్టర్ గేమ్ ఉందన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణ భవన్ లో మాట్లాడిన హరీష్… ..ఎప్పటికి గోదావరి ప్రజల గుండెల్లో ఆర్థర్ కాటన్ నిలిచినట్టే, కేసీఆర్ కూడా తెలంగాణలో చిరస్థాయిగా నిలుస్తారు” అని చెప్పడం… ఇప్పుడు అధికార ప్రభుత్వానికి సవాల్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికను కచ్చితంగా ప్రజల ముందుకు తేవడానికి రెడీ అవుతున్న సమయంలో.. హరీశ్ ఇలా మాట్లాడటం వెనుక ఏ రాజకీయ లెక్కలు ఉన్నాయో అన్నదానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
ఇది నిజమైన ప్రజాభిమానమా? లేక కమిషన్ ముందు చిత్తశుద్ధిని చూపే నాటకమా? కేసీఆర్ మీద దుమారం పెరుగుతున్న సమయంలో… ఆయనను కాటన్గా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న బీఆర్ఎస్ యత్నం, ప్రజల దృష్టిలో వాస్తవంగా నిలబడతుందా? లేక… ఇదంతా మేకపోతు గాంభీర్యమని ప్రజలు తేల్చిపెడతారా? మొత్తంగా ఇది కేవలం రాజకీయ వ్యూహమా? లేక కేసీఆర్ను క్లీన్ చీట్ ఇవ్వడానికే హరీష్ రావు ప్రయత్నమా? అన్నది త్వరలో తేలనుంది.
Also Read: Priyanka: దేశాన్ని ప్రేమించడానికీ రిజిస్టర్ చేయించుకోవాలా..? పాయింటే కదా మరి..