EPFO
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ (PF) వడ్డీ డబ్బులను అకౌంట్ హోల్డర్ల అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను ఈపీఎఫ్వో (EPFO) స్పీడప్ చేసింది. ఇప్పటికే సుమారు ఎనభై శాతం మంది ఎంప్లాయిస్ ఖాతాల్లో ఈ ఇంట్రెస్ట్ మనీ పడిపోగా, మిగిలిన వారికి కూడా ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి స్థాయిలో జమ అవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే తమ అకౌంట్కు వడ్డీ యాడ్ అయిందా.. అయితే దానిని మొబైల్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో చాలామందికి తెలీడం లేదు.
పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ , ఇంట్రెస్ట్ వివరాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ కూడా ముందుగా మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) యాక్టివ్గా ఉండటం తప్పనిసరి అని తెలుసుకోవాలి.
ముందుగా ఈపీఎఫ్వో(EPFO) అధికారిక వెబ్సైట్ ద్వారా వడ్డీ , బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. దీనికోసం పోర్టల్లోకి వెళ్లి పాస్బుక్ సర్వీస్ను సెలెక్ట్ చేసుకుని.. అక్కడ మీ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్తో పాటు స్క్రీన్పై కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కంపెనీ ఐడీని ఎంచుకుని, పాస్బుక్ విభాగంలో లేటెస్ట్ ఇయర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ అకౌంట్లో జమ అయిన వడ్డీ వివరాలు కనిపిస్తాయి.
వెబ్సైట్ కాకుండా స్మార్ట్ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ (UMANG) యాప్ ఉపయోగపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, అందులో ఈపీఎఫ్ఓ సర్వీసులను ఎంచుకోవాలి. ఆ తర్వాత వ్యూ పాస్బుక్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ యూఏఎన్ నంబర్ ఇవ్వాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే మీ పూర్తి వివరాలు స్క్రీన్పై వస్తాయి. కావాలి అనుకుంటే పాస్బుక్ను పీడీఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక ఇంటర్నెట్ అవసరం లేకుండా ఒక చిన్న ఎస్ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్ నుంచి ‘EPFOHO UAN TEL’ అని టైప్ చేసి 7738299899 నెంబర్కు మెసేజ్ పంపితే, తెలుగులోనే మీ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.
అలాగే మీ పీఎఫ్ అకౌంట్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్కు మిస్డ్కాల్ ఇస్తే రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్గా కట్ అయి, బ్యాలెన్స్ వివరాలతో కలిపి మెసేజ్ వస్తుంది. అయితే చాలా మందికి మిస్డ్కాల్ ఇచ్చినా లేదా ఎస్ఎంఎస్ పంపినా ఎలాంటి రిప్లై రావడం లేదు.
దీనికి ప్రధాన కారణం మీ యూఏఎన్ నెంబర్కు కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తి కాకపోవడం అండ్ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్లో లేకపోవడం. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ పీఎఫ్ అకౌంట్తో సరిగ్గా లింక్ కానప్పుడు లేదా మీ పేరు, పుట్టిన తేదీలలో తప్పులు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి.
ఒకవేళ మిస్డ్కాల్ ద్వారా సమాచారం రాకపోతే కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే ఈపీఎఫ్వో పోర్టల్లోకి లాగిన్ అయి మీ ప్రొఫైల్ విభాగంలో కేవైసీ అప్డేట్ ఉందో లేదో సరిచూసుకోవాలి. బ్యాంకు అకౌంట్లో మార్పులు జరిగినప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నిలిచిపోతుంది. ఒకవేళ అన్ని వివరాలు సరిగ్గా ఉన్నా టెక్నికల్ సమస్యల వల్ల మెసేజ్ రాకపోతే, ఈపీఎఫ్వో గ్రీవెన్స్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ నమోదు చేయొచ్చు.
