Varahi Navaratri : శత్రు భయాన్ని పటాపంచలు చేసే వారాహి దేవి నవరాత్రులు ..పూజ ఎలా చేయాలి? ఏం చేయకూడదు?

Varahi Navaratri : వారాహి అమ్మవారిని ఆషాడ నవరాత్రుల్లో పూజించడం వల్ల ఎన్నో అద్భుత ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి

Varahi Navaratri

సాధారణంగా దసరా నవరాత్రులు, చైత్ర నవరాత్రులు గురించి మనకు బాగా తెలుసు. కానీ అత్యంత శక్తిమంతమైనవి, కేవలం ఉపాసకులు మాత్రమే అత్యంత రహస్యంగా జరుపుకునే నవరాత్రులు మరో రెండు ఉన్నాయన్న విషయం మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. వాటినే గుప్త నవరాత్రులు అంటారు.

అందులో ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులను శ్రీ వారాహి దేవి నవరాత్రులు(Varahi Navaratri) అంటారు. లలితా త్రిపురసుందరి దేవి సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారు సాక్షాత్తూ భూదేవి స్వరూపంగా భక్తులు కొలుస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని కొలిస్తే తమ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని నమ్ముతారు.

వారాహి అమ్మవారు ఉగ్ర స్వరూపంగా కనిపించినా సరే.. భక్తుల పట్ల మాత్రం అత్యంత కరుణామయిగా ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని ఈ ఆషాడ నవరాత్రుల్లో పూజించడం వల్ల ఎన్నో అద్భుత ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి

శత్రు వినాశనం, కోర్టు కేసులు.. మిమ్మల్ని అడ్డుకునే శత్రువుల కుట్రలు పటాపంచలు అవుతాయి. కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారుతాయి.
నరఘోష – దృష్టి దోషాలు.. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో అశాంతి వంటి సమస్యలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

ఆర్థిక కష్టాల నుంచి విముక్తి.. భూదేవి స్వరూపిణి కాబట్టి.. ఇల్లు, స్థలాలు కొనాలనుకునే వారికి, వ్యవసాయం చేసే వారికి వారాహి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
ధైర్యం, ఆత్మవిశ్వాసం.. మానసిక భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోయి అపారమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

చాలా మంది వారాహి అమ్మవారు ఉగ్రరూపం కదా, ఇంట్లో పూజించొచ్చా అని అనుమానం వ్యక్తం చేస్తుంటారు. కానీ, భక్తితో, నిష్కల్మషమైన మనసుతో తల్లిలా భావించి మన ఇంట్లోనే భక్తితో పూజ చేసుకోవచ్చు.

అమ్మవారి పటం లేదా చిన్న విగ్రహం ఉంటే సరిపోతుంది, పసుపు, కుంకుమ, ఎర్రటి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు మందారాలు అవి లేకపోతే ఎర్ర గులాబీలు ఉండేలా చూసుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నైవేద్యంగా దానిమ్మ పండ్లు, చిలగడదుంపలు , బెల్లం పరమాన్నం,బెల్లం పానకం పెట్టాలి..

1.పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవడం.. ఉదయం లేదా సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత పూజ చేయడం మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసి, ఒక చిన్న పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవాలి. దానిపై వారాహి అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి.

2. దీపారాధన – సంకల్పం..వారాహి అమ్మవారికి కుడి వైపున ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. చేతిలో అక్షతలు పట్టుకుని నా కష్టాలు తొలగిపోవాలి, కుటుంబంలో సుఖశాంతులు కలగాలని మనసులో బలంగా కోరుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. లేదంటే మీకు నచ్చిన కోరికను బలంగా కోరుకోవాలి.]

3. మంత్ర జపం – స్తోత్ర పఠనం.. అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేస్తూ.. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యై నమః అనే ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు కనీసం 108 సార్లు అయినా జపించాలి. దీంతో పాటు వారాహి అనుగ్రహాష్టకం లేదా వారాహి కవచం చదువుకోవడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది.

4. నైవేద్య సమర్ప.. అమ్మవారికి ఇష్టమైనవి. చిలగడదుంపలు, దానిమ్మ పండ్లు, బెల్లం పరమాన్నం, పెసరపప్పుతో చేసిన వడపప్పును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి.

Varahi Navaratri

అలాగే నవరాత్రులు(Varahi Navaratri )ముగిసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఈ తొమ్మిది రోజుల్లో వచ్చే జూలై 19న పంచమి రోజున నిమ్మకాయను ప్రమిదలా చేసి అందులో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే తీవ్రమైన నరదృష్టి దోషాలు పోతాయి. చెడు మాట్లాడటం, ఇతరులను దూషించడం వంటివి అస్సలు చేయకూడదు.

EPFO : మీ పీఎఫ్ ఖాతాలోకి వడ్డీ డబ్బులు పడ్డాయా?.. మిస్డ్‌కాల్ ఇచ్చినా వివరాలు రావడం లేదా?..

Exit mobile version