Solid Waste Management
మనం ప్రతిరోజూ వీధుల్లో చెత్తను చూస్తూనే ఉంటాం. అయితే రోడ్ల పక్కన కుప్పలుగా పేరుకుపోయే చెత్త.. మన పర్యావరణాన్ని, చివరికి తాగే నీటిని ఎంతగా విషతుల్యం చేస్తుందనే విషయంపై .. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చెత్తను ఉత్పత్తి చేసే హక్కు ఉంది కానీ, దానివల్ల వచ్చే నష్టాలను మాత్రం క్లియర్ చేయడానికి తాము బాధ్యత తీసుకోమని ప్రవర్తించే బాధ్యతారాహిత్యంపై సర్వోన్నత నాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మున్సిపల్ సంస్థలు సాలిడ్ వేస్ట్ నిర్వహణ (Solid Waste Management) నిబంధనలను సక్రమంగా అమలు చేయాలన్న అంశంపై.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) ఇచ్చిన జీవోలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిజానికి ఇది మొదట మధ్యప్రదేశ్లోని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఒక చిన్న ప్రాంతీయ సమస్యగానే ప్రారంభమైంది. కానీ విచారణ సాగుతున్న కొద్దీ సమస్య తీవ్రత అర్థమై.. ఇది ఒక్క భోపాల్దే కాదు, దేశం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య అని గుర్తించిన సుప్రీంకోర్టు ఈ విచారణను దేశవ్యాప్తంగా విస్తరించింది.
చెత్తను భారీగా ఉత్పత్తి చేసే హోటళ్లు, హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్, పెద్దపెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, గవర్నమెంట్ ఆఫీసులు, రైల్వేలు, డిఫెన్స్ సెక్షన్ వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లను 6 వారాల్లోగా కరెక్టు వివరాలతో గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా రాష్ట్రాల సీఎస్లు , కలెక్టర్లు ఈ బాధ్యతను తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ సంస్థలకు నిబంధనలను క్లియర్గా వివరించి, అవి సరిగ్గా పాటిస్తున్నాయో లేదో చెక్ చేయడానికి స్పెషల్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
నిబంధనలు పాటించని సంస్థలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే మాత్రం ఆ సంస్థలకు ఇచ్చే పవర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లను కూడా టెంపరరీగా కట్ చేయొచ్చని ఆర్డర్ పాస్ చేసింది. మళ్లీ కోర్టు రూల్స్ పాటిస్తున్నామని ప్రూవ్ చేసుకుంటేనే ఆ కనెక్షన్లను పునరుద్ధరించాలని చెప్పింది.
అంతేకాదు వేస్ట్ను ఎక్కడబడితే అక్కడ పడేయడం వల్ల వర్షపు నీటితో పాటు అది కూడా కొట్టుకుపోయి నదులు తీవ్రంగా కలుషితమవుతున్నాయని, దీనిపై స్పెషల్గా రిపోర్ట్లు ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అక్రమాలను అడ్డుకోవడానికి చెత్త పేరుకుపోయిన ఏరియాల జియో-ట్యాగ్డ్ ఫోటోలు, మంత్లీ రిపోర్టులను పోర్టల్లో అప్లోడ్ చేయాలని టెక్నాలజీని యాడ్ చేసింది.
నిజానికి వినడానికి సింపుల్గా అనిపించే ఈ చెత్త సమస్య.. మన పర్యావరణాన్ని, భవిష్యత్తు తరాల ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తోంది. అందుకే స్కూళ్లు, కాలేజీల సిలబస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ లెసన్స్ను వెంటనే చేర్చాలని, టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ ద్వారా ఇళ్లలోనే అవగాహన తేవాలని కోర్టు సూచించింది.
అయితే ఇన్ని రోజులూ చెత్తను శుభ్రం చేయడమంటే కేవలం పారిశుద్ధ్య సిబ్బంది పని మాత్రమే అని చాలామంది అనుకునేవారు. కానీ చెత్తను ప్రొడ్యూస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక బాధ్యత ఉందని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
Varalakshmi Vratam Prasadam : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. ఈ 5 నైవేద్యాలు ఈజీగా ఇలా ట్రై చేయండి..
