Vande Mataram At Red Fort
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈసారి కేవలం జెండా ఆవిష్కరణకు మాత్రమే పరిమితం కాలేదు. భారత దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడని ఒక మహా ఘట్టానికి వేదికగా మారాయి.
ఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ జెండా ఎగిరిన ఆ శుభ సమయాన, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది గుండెలు ఉప్పొంగేలా ఒక కొత్త మైలురాయి ఆవిష్కృతమైంది.
స్వాతంత్య్ర సమరంలో కోట్లాదిమందిలో దేశభక్తి జ్వాలలు ఎగిసిపడేలా చేసిన జాతీయ గేయం వందేమాతరం పూర్తి స్వరాలన్నీ, స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎర్రకోట అధికారిక వేడుకల్లో ప్రతిధ్వనించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ స్వాతంత్య్ర వేడుకల్లో, జాతీయ గీతం జన గణ మనతో పాటు వందేమాతరం గీతాన్ని కూడా ఆర్మీ బ్యాండ్ అత్యంత వైభవంగా ఆలపించింది. జాతీయ గేయం వందేమాతరం రూపుదిద్దుకుని ఈ ఏడాదికి 150 ఏళ్లు పూర్తికావడంతో ఈ వేడుకకు మరింత ప్రత్యేకత చేకూరింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాక.. 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) ఆధ్వర్యంలో మన స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్తో 21 సార్లు గన్ సెల్యూట్ చేస్తూ గగనతలాన్ని హోరెత్తించారు. ఆ వెంట వెంటనే ఆర్మీ బ్యాండ్ అక్కడివారిని పరవశింపజేసేలా వందేమాతరం మధుర స్వరాలను ఆలపించింది.
సరిగ్గా అదే టైమ్లో భారత వైమానిక దళానికి చెందిన 2 ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపైన పూల వర్షాన్ని కురిపించాయి. దానిలో ఒక హెలికాప్టర్పై మన మువ్వన్నెల జెండా ఎగురుతుండగా, మరో హెలికాప్టర్పై పెద్ద అక్షరాలతో వందేమాతరంఅని రాసి ఉన్న జెండా దర్శనమిచ్చింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎర్రకోటపై అఫీషియల్గా వందేమాతరం గీతాన్ని వాయించడం ఇదే మొదటిసారి అని ప్రధానమంత్రి తన ప్రసంగంలో సగర్వంగా ప్రకటించారు.
అయితే ఈ చారిత్రాత్మక ఘట్టం వెనుక ఒక పవర్ఫుల్ చట్టపరమైన రక్షణ కూడా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ గౌరవ అవమానాల నివారణ బిల్లు-2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేశారు.
ఈ కొత్త చట్టం ప్రకారం, జాతీయ గీతం జన గణ మనకి ఎలాంటి చట్టపరమైన గౌరవం, రక్షణ ఉందో.. ఇకపై జాతీయ గేయమైన వందేమాతరం గీతానికి కూడా అదే రక్షణ లభిస్తుంది.
ఇకపై ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గీతం ఆలాపనను అడ్డుకున్నా, లేదా ఆ గేయాన్ని అవమానించేలా ప్రవర్తించినా కూడా.. చట్టప్రకారం వారికి కఠినమైన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా నిబంధనలను రూపొందించారు.
ఇక ఇండిపెండెన్స్ డే కి ముందు రోజు సాయంత్రం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతీసారి ప్రసంగించే సాంప్రదాయ కార్యక్రమంలో కూడా ఈ మార్పు క్లియర్గా కనిపించింది. రాష్ట్రపతి ప్రసంగం కంటే ముందు, ప్రసంగం ముగిసాక కూడా వందేమాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేశారు.
స్వదేశీ ఉద్యమ కాలంలో మన దేశాన్ని ఏకం చేసిన మహా శక్తిగా వందేమాతరం సగర్వంగా నిలిచిందని రాష్ట్రపతి తన ప్రసంగంలో కొనియాడారు. మొత్తంగా ఈ కొత్త చట్టం , ఎర్రకోట వేడుకల ద్వారా మన దేశ జాతీయ గేయానికి జాతీయ గీతంతో సమానమైన అత్యున్నత స్థానం, రక్షణ లభించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
