Ashadha Amavasya
మన పూర్వీకుల త్యాగాలను,మన మూలాలను స్మరించుకోవడానికి హిందూ సంప్రదాయంలో గల అత్యంత ఆధ్యాత్మికమైన రోజుల్లో ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య ఒకటిగా మన పెద్దలు చెబుతారు. ఈ ఏడాది ఆగస్టు 12వ తారీఖు బుధవారం రోజు ఈ పవిత్రమైన రోజు వచ్చింది.
మనల్ని ఈ లోకంలోకి తెచ్చి, ఈరోజు మనముంటున్న ఈ స్థాయికి కారణమైన పితృదేవతలందరినీ భక్తిశ్రద్ధలతో తలచుకుని, వారి ఆశీస్సులు పొందడానికి ఇదొక మంచి అవకాశం. ఇంట్లో పూజా పునస్కారాల నుంచి మన పూర్వీకుల పట్ల కృతజ్ఞత చూపే వరకు ప్రతీ ఒక్కటి కూడా ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా పాటించాల్సిన రోజు ఇది.
ఆగస్టు 12న ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు, ముఖ్యంగా దేవుడి గదిని శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత మన పూర్వీకుల ఫోటోలను భక్తితో శుభ్రం చేసి, పూలమాలలను వేసి, దీపారాధన చేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.
ఈ రోజు అన్నం, పప్పు, కూరగాయలతో చేసిన సాత్వికమైన శాకాహారాన్ని వండి పితృదేవతలకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న ఏదైనా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడంతో పాటు మన స్తోమతకు తగ్గట్టు పేదలకు ఫుడ్, బట్టలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
అయితే పితృదేవతలకు పూజలు చేయడం ఎంత ముఖ్యమో, ఈ రోజు కొన్ని పనులకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, ప్రశాంతమైన ఆధ్యాత్మికంగా ఉండాలి. అనవసరమైన కోపతాపాలు, గొడవలు, మనస్పర్థలు, ఎదుటివారిని బాధించే మాటలు వంటివి లేకుండా చూసుకోవాలి.
ఆడంబరాలకు, అనవసరమైన ఖర్చులకు, ఎంటర్టైన్మెంట్లకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో రోజంతా గడపాలి. ముఖ్యంగా పూర్వీకులను తలచుకునే రోజు కాబట్టి.. కుటుంబంలో పాత వివాదాలను తవ్వి తీయకుండా ప్రశాంతంగా ఉండాలి.
మొత్తంగా ఈ ఆషాఢ అమావాస్య(Ashadha Amavasya )ఉద్దేశం మన పూర్వీకుల పట్ల మనకున్న కృతజ్ఞతను, గౌరవాన్ని చూపించడమే. కాబట్టి ఆగస్టు 12న ప్రశాంతమైన మనసుతో , నిర్మలమైన భక్తితో గడిపి ఈ రోజు పితృదేవతల ఆశీస్సులను పొందండి.
Transparency : బంధంలో సగం నిజాలు ప్రమాదమా? పార్ట్నర్తో పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఉండాల్సిందేనా?
