Chitra Pournami
తమిళనాడులోని తిరువణ్ణామలైలో వెలసిన శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో.. చిత్ర పౌర్ణమి(Chitra Pournami) వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రతి ఏడాది చిత్తరై మాసంలో వచ్చే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రమైన కార్యంగా భక్తులు భావిస్తారు.
ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని.. వివిధ రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. ఆలయ అధికార యంత్రాంగం , జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లను చేస్తోంది. సాధారణంగా కార్తీక పౌర్ణమి, కార్తీక దీపోత్సవం వంటి విశేష పర్వ దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ రోజు ఆలయాన్ని తెల్లవారుజాము నుంచే తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కాగా ఈ ఏడాది మే 1 వ తారీఖున చిత్ర పౌర్ణమి వస్తోంది. ఈ సందర్భంగా ఉన్నములై అమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామికి తెల్లవారుజాము నుంచే పాలు, పెరుగు, పన్నీరు, పంచామృతం, తేనె , పవిత్ర జలాలతో అత్యంత వైభవంగా అభిషేకాలను నిర్వహిస్తారు.
తర్వాత స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక దీపారాధన, ఆరాధనలు చేస్తారు. ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ లేదా గిరివలయం చేయడం అనేది ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల వరకూ సాగే ఈ గరి ప్రదక్షిణ మార్గంలో నడిచి తమ కోరికలను శ్రీ అరుణాచలేశ్వరుడికి విన్నవించుకుంటే.. తమ మొక్కులు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు.
కాగా ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించిన శుభ ముహూర్తాన్ని భక్తుల సౌకర్యం కోసం ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ సమయం ఏప్రిల్ 30న రాత్రి 9.52 గంటలకు ప్రారంభమయి, మే 1వ తారీఖు రాత్రి 11.08 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో గిరి వలయం చేయడానికి భక్తులు తమ తమ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది దాదాపు 30 లక్షల మందికి పైగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
చిత్ర పౌర్ణమి(Chitra Pournami) వేడుకలలో ముఖ్యఘట్టమైన గిరివలయం కోసం భారీగా తరలి రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన వసతులను కల్పిస్తున్నారు. ప్రదక్షిణ మార్గంలో తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. అత్యవసర పరిస్థితులు ఎదురయితే వాటిని ఫేస్ చేయడానికి అగ్నిమాపక యంత్రాంగాన్ని,వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. అలాగే శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించి ..జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
Phone : రాత్రి నిద్రను చంపుకుని మరీ ఫోన్ చూస్తున్నారా? మీ మెదడు చేసే జిమ్మిక్కులో పడకండి..
