Registration Values
రియల్ ఎస్టేట్ (Real Estate) రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా భూముల ప్రభుత్వ మార్కెట్ విలువను (Land Registration Values) సవరించడానికి రేవంత్ సర్కార్ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఉన్న అసలైన ధరలకు, రిజిస్ట్రేషన్(Registration Values )డిపార్ట్మెంట్ రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ ధరలకు మధ్య కొండంత వ్యత్యాసం ఉంది. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించి, స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా కొత్త ధరలను నిర్ణయించే బాధ్యతను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భుజానికెత్తుకుంది. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే గతంలో 2021, 2022 లో జరిగిన సవరణల తర్వాత మళ్లీ ఇప్పుడు భూముల విలువను పెంచడానికి కసరత్తు మొదలైంది.
ప్రభుత్వ తాజా స్ట్రాటజీ ప్రకారం.. వ్యవసాయ ,సాగు భూముల విలువను ముఖ్యంగా మూడు రకాలుగా విభజించి సవరించనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, నేషనల్ హైవే, మెయిన్ రోడ్డు పక్కన ఉన్న భూములు, అలాగే మండల కేంద్రాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాల ప్రాతిపదికన ఈ ధరల మార్పులు ఉంటాయి.
ఈ సవరణల వల్ల మొత్తంగా సాగు, సాగేతర , స్థిరాస్తుల గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ విలువ సుమారు 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్య ప్రజలపై ఒకేసారి భారీగా భారం పడకుండా, క్షేత్రస్థాయి కండిషన్లు బేరీజు వేసుకుంటూ ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు నుంచే కొత్త ధరలను అమలు చేసే ఆలోచనతో అధికారులు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు.
ఈ ప్రతిపాదిత మార్పుల వల్ల రిజిస్ట్రేషన్ల ల్యాండ్ మార్క్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఎకరా వ్యవసాయ భూమి ప్రభుత్వ మార్కెట్ విలువ రూ. 1.75 లక్షల నుంచి రూ. 2.75 లక్షల వరకు ఉండగా, దానిని సవరించడానికి అంచనాలు సిద్ధం చేశారు. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ప్రాంతాలలో ఇప్పటివరకు ఎకరా భూమికి.. రిజిస్ట్రేషన్ విలువ రూ. 8.75 లక్షలుగా ఉంటే, దానిని కనిష్టంగా రూ. 15 లక్షలకు పెంచడానికి చూస్తున్నారు.
ఐటీ కారిడార్ దగ్గరలోని వట్టినాగులపల్లి వంటి హాట్ స్పాట్ ఏరియాలలో బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ. 70 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు పలుకుతుండగా, అక్కడ ప్రభుత్వ విలువను రూ. 2.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. అపార్ట్మెంట్ల విషయానికి వస్తే, ప్రస్తుతం స్కేర్ ఫీట్ (Per Sft) విలువ రూ. 3,500 నుంచి రూ. 4,000 ఉన్న ప్రాంతాల్లో దానిని ఏకంగా రూ. 6,000 వరకు సవరించనున్నారు. అంటే ఫ్లాట్ల ప్రభుత్వ విలువ సుమారు 75 శాతం వరకు పెరగొచ్చు.
మహానగర పరిధిలోని కమర్షియల్ , వాణిజ్య ప్రాంతాలలో కూడా ఈ సవరణలు ఒకే పద్ధతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వంద అడుగుల రోడ్లు, ప్రధాన కనెక్టివిటీ ఉన్న చోట్ల ఓపెన్ ధరలను బట్టి ప్రభుత్వ విలువను చదరపు అడుగుకు రూ. 6,600 వరకు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే సిటీలోని సుమారు 350 ప్రధాన ఏరియాలలో అక్కడి డిమాండ్ను బట్టి విడివిడిగా ధరలను పెంచనున్నారు.
ఉదాహరణకు జూబ్లీహిల్స్ లాంటి హై-ఎండ్ ఏరియాలలో చదరపు గజం ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ(Registration Values) రూ. 80 వేల నుంచి రూ. 90 వేలకు చేరే ఛాన్స్ ఉంది. ఈ సరికొత్త మార్కెట్ విలువల సవరణ ద్వారా ఇప్పటి వరకూ ఏటా రూ. 15 వేల కోట్లుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్కమ్ అదనంగా మరో రూ. 1,500 కోట్ల వరకు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold Prices :వరుసగా తగ్గుతున్న గోల్డ్ ధరలు.. నాలుగు రోజుల్లోనే దిగొచ్చిన పుత్తడి ధర
