Bandi Bhagiratha
తెలంగాణలో సంచలనంగా మారిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
ఈ సందర్భంగా భగీరథ(Bandi Bhagiratha) తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు ముందు పలు కీలక విషయాలు తీసుకొచ్చారు. బాధితురాలి వయసు విషయంలో తేడాలున్నాయని చెప్పారు. 2021లో బాధితురాలు ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసుకు సంబంధించి అప్పట్లో మైనర్ అని రాసారని గుర్తు చేశారు.
అలాగే పాన్, ఆధార్ కార్డులలో వేర్వేరు పుట్టిన తేదీలున్నాయన్నారు. బాధితురాలి వయస్సు 19 లేదా 20 సంవత్సరాలు ఉండొచ్చని తెలిపారు. బాధితురాలి తల్లి ఆమె వయసు మార్చి కుట్రపూరితంగా పోక్సో కేసు పెట్టారని ఆరోపించారు. ఘటన జరిగిన 8 నెలల తర్వాత ఫిర్యాదు చేయడం వెనుక దురుద్దేశం కనిపిస్తోందన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బాధితురాలి పుట్టినతేదీపై వెరిఫికేషన్ చేయమని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో భగీరథ బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే ఈ లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని భగీరథ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు.
మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే భగీరథ సిట్ విచారణకు హాజరవుతాడని కోర్టుకు తెలియజేశారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినేందుకు శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అటు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ముందస్తు బెయిల్ ఇచ్చినట్టేనని పీపీ చెబుతున్నారు.
మరోవైపు విచారణకు రమ్మని నోటీసులిచ్చినా భగీరథ హాజరుకాలేదు. అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుండగా సిట్ అధికారులకు భగీరథ మెయిల్ పంపాడు. వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోయానని, శుక్రవారం తన దగ్గరున్న ఆధారాలు, డాక్యుమెంట్లతో విచారణకు వస్తానంటూ మెయిల్ లో పేర్కొన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సిట్ అధికారులకు సమాచారమిచ్చారు.
కానీ భగీరథ (Bandi Bhagiratha)ఎక్కడ ఉన్నాడనేది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే భగీరథను కాపాడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు భగీరథను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
