Sravana Masam Prasadam
మహిళలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది. ఈ సమయంలో చాలా మంది లక్ష్మీదేవికి ఇష్టమైన రకరకాల ప్రసాదాలు చేస్తుంటారు. అయితే శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన, అష్టైశ్వర్యాలను ఇచ్చే గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని మాత్రం తప్పక చేయాలంటున్నారు పండితులు.
శ్రావణ మాసంలో శుక్రవారం లేదా మంగళవారం రోజు గోధుమ రవ్వతో చేసిన కేసరిని నైవేద్యంగా సమర్పిస్తే ఆ దేవత సంతోషించి, ఆ ఇంట్లో సిరిసంపదలు కురిపిస్తుందని పండితులు, పెద్దలు చెబుతారు. ఈ ప్రసాదాన్ని నోట్లో వేస్తే కరిగిపోయేలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఈ కేసరి తయారు చేయడానికి ఎరుపు రంగు గోధుమ రవ్వ, ఒక కప్పు షుగర్, ఒక కప్పు బెల్లం, పటిక, నెయ్యి, కుంకుమ పువ్వు ( ఆప్షనల్), యాలికల పొడి, రెండు కప్పుల నీళ్లు, ఒక కప్పు పాలు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు (నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి) తీసుకోవాలి.
ఇక తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. అందులో గోధుమ రవ్వను వేసి దోరగా, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి అంత రుచిగా ఉంటుంది. వేగిన రవ్వను వేరే బౌల్లోకి తీసుకుని, అదే పాన్లో మరొక టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరొక పాత్రలో కొలతల ప్రకారం పాలు, నీళ్లు పోసి, నీరు పొంగులా వచ్చే వరకు బాగా మరిగించాలి. నీళ్లు పొంగుతున్నప్పుడు వేయించిన రవ్వను వేసి ఉండలు కట్టకుండా మెత్తగా ఉడకబెట్టాలి. రవ్వ 70 శాతానికి పైగా ఉడికిన తర్వాత.. షుగర్, బెల్లం తురుము వేసి సుమారు పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి.
రవ్వ మొత్తం మెత్తగా ఉడికి అంతా బాగా కలిసిపోయిన తర్వాత అందులో కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, టీ స్పూన్ నెయ్యి ,వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కేసరిని శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా(Sravana Masam Prasadam) సమర్పించి లక్ష్మీ దేవి దివ్య దీవెనలను పొందండి.
