Medico Priyanka Dead
రాజమండ్రిలో కారు ఢీకొట్టడంతో గాయపడిన మెడికో స్టూడెంట్ ప్రియాంక మృతి చెందింది. మద్యం మత్తులో ఇద్దరు నిందితులు కారుతో ఢీకొట్టడంతో మూడు రోజులుగా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. కారు తలపై నుంచి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ కావడం, వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించడంతో కొన ఊపిరితో మూడురోజులుగా మృతృవుతో పోరాడిన ఆమె చివరకు కొద్దిసేపటి క్రితం కన్నుమూసింది.
ప్రియాంక మృతిని ధృవీకరిస్తూ సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్లోనే ఆమె మృతదేహాన్ని ఉంచారు. ప్రియాంక తల్లిదండ్రులు, రాజమండ్రి పోలీసులు వచ్చిన తర్వాత స్వస్థలానికి తరలించనున్నారు. ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రియాంక తన ఫ్రెండ్తో స్కూటీపై వెళుతుండగా వెనుకనుంచి సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ కారుతో ఢీకొట్టారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె స్కూటీని ఢీకొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. ఢీకొట్టిన వెంటనే ఆమె తలపై నుంచి కారు వెళ్లడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడింది.
వెంటనే స్థానికులు, స్నేహితులు ఆమెను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్కు తీసుకొచ్చారు. అయితే తలపై నుంచి రెండు చక్రాలు బలంగా ఎక్కడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. చిన్నపాటి ఆశతో చికిత్స అందిస్తూ ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు. వైద్యుల పోరాటం ఫలించకపోవడంతో ఆమె కన్నుమూసింది.
ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించింది. నిందితులు ఢీకొట్టిన వెంటనే పరారవగా, పోలీసులు వెంటనే స్పందించి అరెస్ట్ చేశారు. మొదట మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా ముందు భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్టు గుర్తించారు.
దీంతో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , హోం మంత్రి అనిత ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు తమ కుమార్తెకు జరిగిన ఇలాంటి ఘటన మరెవరికీ జరగకూడదని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఆమె తండ్రి కోరారు. తెలంగాణలోని గద్వాల జిల్లా ఎక్లాస్ పూర్ ప్రియాంక స్వస్థలం. ఎంబీబీఎస్ తర్వాత ఆమె రాజమండ్రిలో పీజీ చేస్తోంది. ప్రియాంక మృతితో ఆమె స్వగ్రామంలో విషాదం నెలకొంది.
మొత్తంగా మద్యం మైకం, హద్దులు లేని నిర్లక్ష్యం కలిసి ఒక నిండు ప్రాణాన్ని, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక మెడికోను బలి తీసుకోవడం ఎవరూ మర్చిపోలేని ఘటనగా మిగిలిపోనుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదాల కన్నా, తాగిన మత్తులో విచ్చలవిడిగా వెహికల్స్ నడిపి ఇతరుల ప్రాణాలను తీసే ఇలాంటి రాక్షసత్వమే సొసైటీకి చాలా ప్రమాదం. ఇలాంటివారికి చట్టప్రకారం కఠినమైన శిక్ష పడినప్పుడే ఆమె ఆత్మకు శాంతి, ఆమె తండ్రికి న్యాయం చేకూరి సొసైటీలో భయం పెరుగుతుంది.
