Animal Health Camp
వ్యవసాయానికి ఎప్పుడూ కూడా పశుసంపదే వెన్నెముక. పాడిపంటలు బాగుంటేనే ప్రతీ ఒక్క రైతు ఇల్లు కళకళలాడుతుంది. దీనిలో భాగంగానే మూగజీవాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమంటే అది పరోక్షంగా రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే అని ఏపీ ప్రభుత్వం గుర్తించింది.
ఈ ఉద్దేశంతో విశాఖ జిల్లా చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో .. మార్చి 28న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (AMC) ఆధ్వర్యంలో జరిగిన మెగా యానిమల్ హెల్త్ క్యాంప్(Animal Health Camp)కు విశేష స్పందన లభించింది. కేవలం పశువులకు ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, లేటెస్ట్ టెక్నాలజీతో చేసే పరీక్షల ద్వారా పశువులకు సోకే వ్యాధులను ముందే గుర్తించి, తగిన జాగ్రత్తలు సూచిస్తూ ప్రధాన ఉద్దేశ్యంగా సాగిన ఈ శిబిరంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన చోడవరం ఇంచార్జి పీవీ ఎస్ ఎన్ రాజు , AMC ఛైర్మన్ అల్లం మాధవి రామప్పారావు పాల్గొన్నారు. వారితో పాటు AMC డైరెక్టర్ పల్లా అప్పారావు , AMC సెక్రటరీ బంగార్రాజు , చోడవరం ఏడీ (AD) శ్రీనివాస్ తమ సమక్షంలో ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు.
ఈ వైద్య శిబిరంలో సుమారు 60 పశువులకు నిపుణులైన వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను రైతులకు ఫ్రీగా పంపిణీ చేశారు. డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ వాత్సవి, డాక్టర్ అచ్యుత్ రామ్ పశువుల ఆరోగ్య స్థితిని పరిశీలించి రైతులకు కొన్ని సూచనలు చేశారు.
ఈ క్యాంప్లో కేవలం సాధారణ చికిత్సలే కాకుండా, సెంట్రల్ అనలిటికల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ(CADDL) ద్వారా ఆరోగ్యం బాగోలేని పశువులకు పేడ పరీక్షలతో పాటు రక్త పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల పశువులలో ఉండే అంతర్గత పరాన్నజీవులు, రక్తహీనతతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పశువులలో ఎక్కువగా వచ్చే గాలికుంటు వ్యాధి, జబ్బ వాపు వ్యాధి, గొంతువాపు వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు, దూడలలో వచ్చే విరేచనాలు, నులిపురుగుల సమస్యల నివారణకు ఈ క్యాంప్ ఎంతో దోహదపడింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువుల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలోనే ఇలాంటి వైద్య శిబిరాలు(Animal Health Camp) నిర్వహించడం వల్ల తమపై భారం పడకుండా ఉండటంతో పాటు పశువుల మరణాల రేటు తగ్గుతుందని ఆనందం వ్యక్తం చేశారు .
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (Agriculture Market Committee) సిబ్బంది, చోడవరం మండల పశుసంవర్ధక శాఖ(Animal Husbandry Department)సిబ్బంది, కేంద్ర విశ్లేషణాత్మక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల( Central Analytical Disease Diagnostic Laboratory)సిబ్బందితో పాటు సంచార పశువైద్య శాల( Mobile Animal Veterinary Clinic )పాల్గొన్నారు. మొత్తంగా పశువైద్యం రైతు ఇంటి ముంగిటికే రావడం పట్ల నర్సాపురం గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Kavya Maran and Anirudh: అనిరుధ్ తో కావ్యా పాప పెళ్లి ?…తమిళ మీడియాలో ప్రచారం
