Nara Lokesh
రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం చాలా ముఖ్యం. ఈ విషయంలో టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటున్నారు. ప్రభుత్వం వచ్చింది కదా అని పార్టీ విషయంలో అశ్రద్ధ చేయలేదు. పైగా 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలిట్ బ్యూరో, జాతీయ , రాష్ట్ర కమిటీలను పక్కా స్ట్రాటజీలు అనుసరిస్తూ ప్రకటించారు.
దీనిలో అన్నింటికంటే ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలను నారా లోకేశ్(Nara Lokesh) కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లోకేశ్ టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.ఇప్పుడు జాతీయ స్థాయిలో లోకేశ్ సేవలను ఉపయోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయం తెలుగు తమ్ముళ్లలో సరికొత్త జోష్ నింపింది.
లోకేశ్(Nara Lokesh) కు ఈ బాధ్యతల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగానే ముందడుగు వేసినట్టు అర్థమవుతోంది. గత కొంతకాలంగా లోకేష్కు పార్టీలో మరిన్ని బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ కార్యకర్తల నుంచి వినిపించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు.
అది జరగాలంటే ఇటు ప్రభుత్వం, అటు పార్టీని ఏకకాలంలో నడపడం కాస్త ఇబ్బందే. ఎందుకంటే ఏపీలో అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు పార్టీ పగ్గాల బాధ్యతలను లోకేశ్ పై ఉంచారు. పైగా కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేతగా లోకేశ్ కు పేరుంది. ప్రభుత్వంలో కీలకమైన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కార్యకర్తలను ఎప్పటికప్పుడు కలుస్తూ, పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు.
ఇకపై పార్టీ వ్యవహారాలను లోకేశ్(Nara Lokesh) సమన్వయం చేసుకుంటే చంద్రబాబుకు పరిపాలనపై మరింత దృష్టి పెట్టే వెసులుబాటు దొరుకుతుందన్నది టీడీపీ శ్రేణుల అభిప్రాయంగా ఉంది. 2029 ఎన్నికల కోసం యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదే కాదు మిగిలిన రాష్ట్ర కమిటీల్లోనూ చంద్రబాబు పకడ్బందీగా పదవులను భర్తీ చేశారు.సీనియర్లకు గౌరవం… కొత్తవారికి అవకాశాలు…సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చినట్టు అర్థమవుతోంది.
నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేసినట్టు చెబుతున్నారు. పోలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు జరిగాయి. ప్రతి కమిటీలోను కొత్త తరానికి అవకాశమిచ్చారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు జరిగింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు.
గత కొంత కాలంగా చెబుతున్నట్టే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో చోటు గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారు.
రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ… 50 మంది మహిళలకు చోటు దక్కింది. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించారు. అటు బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాంత చొప్పున కమిటీలో స్థానం కల్పించారు. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు చేశారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
Theaters:సింగిల్ స్క్రీన్ల మొండిపట్టు..సంక్షోభంలో సమ్మర్ రిలీజ్లు..థియేటర్లు మూతపడటం ఖాయమేనా?
