Social Media Ban
టెక్నాలజీ అభివృద్ధి చెందితే అది వరమే అవుతుంది కానీ, అదే టెక్నాలజీ మన పిల్లల భవిష్యత్తును తినేస్తూ ఉంటే అంతకంటే ప్రమాదం మరోటి ఉండదు. సరిగ్గా ఇదే ఆలోచనతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు.
తాజాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ(Social Media Ban) కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం.. ఇప్పుడు ఏపీలో కూడా అమలు కాబోతోంది.టెక్నాలజీని ఆయుధంగా వాడితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు.. కానీ అదే టెక్నాలజీకి బానిసైతే మాత్రం జీవితాలే నాశనమవుతాయి. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా నొక్కి చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం బాటలోనే తాము కూడా నడుస్తూ, ఏపీలో కూడా చిన్నపిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు.
ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎంత భయంకరంగా ఉందో వివరించిన ఏపీ సీఎం..రాబోయే 90 రోజుల్లో దీనిపై పక్కా విధివిధానాలను రూపొందిస్తామని ప్రకటించారు. ఆస్ట్రేలియా వంటి డెవలప్ చెందిన దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలు తెచ్చిన సమయంలో, నవ్యాంధ్ర కూడా అదే బాటలో సాగడం నిజంగానే చారిత్రాత్మక నిర్ణయమే అవనుంది.
చిన్న వయసులో సోషల్ మీడియా వాడుతూ ఉండటం వల్ల.. వారిలో మెంటల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ పెరిగిపోతున్నాయని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విచ్చలవిడిగా కనిపించే అసభ్యకరమైన కంటెంట్, హింసాత్మకమైన వీడియోలు పిల్లల మెదడుపై చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
దీనివల్ల పిల్లలలో చదువుపై ఏకాగ్రత తగ్గిపోవడమే కాకుండా, నిద్రలేమి, ఆందోళన,ఒంటరితనానికి గురవుతున్న కేసులు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్లు, కామెంట్ల కోసం ఆలోచిస్తూ..ఎదురుచూస్తూ నిజ జీవితంలోని బంధాలకు దూరమవుతున్నారు. అందుకే 13 ఏళ్ల వరకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధాన్ని(Social Media Ban) విధించి, 13 – 16 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఎలాంటి కంట్రోల్ ఉండాలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తెలిపింది.
ఈ నిర్ణయం కనుక అమలులోకి వస్తే అది మన సొసైటీలో ఒక పెద్ద సానుకూల మార్పునకు శ్రీకారం చుట్టినట్టే అవుతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు డిజిటల్ జైలు నుంచి బయటకు వచ్చి స్పోర్ట్స్ మైదానాలలో ఆడుకోవడం, పుస్తకాలతో స్నేహం చేయడం వంటి పాత రోజుల అలవాట్లను మళ్లీ చూడొచ్చంటున్నారు. సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాల నుంచి మన పిల్లలకు రక్షణ కలుగుతుంది. తల్లిదండ్రులకు కూడా ఇది ఒక పెద్ద ఊరట అనే చెప్పొచ్చు.
