Visakhapatnam Port
విశాఖపట్నం పోర్టు(Visakhapatnam Port)అథారిటీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ రంగాలలో పోర్టు యాజమాన్యం తీసుకుంటున్న అద్భుతమైన చర్యలకు .. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందింది.
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, అత్యాధునిక మౌలిక వసతులను డెవలప్ చేస్తున్నందుకు విశాఖపట్నం పోర్టు(Visakhapatnam Port)కు ప్రతిష్టాత్మకమైన ఎల్-2 గ్రీన్ పోర్టు సర్టిఫికేషన్ దక్కింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈఎస్జీ అండ్ సర్క్యులారిటీ కంపెనీ ఈ అరుదైన గౌరవాన్ని అఫీషియల్గా ప్రకటించడంతో పోర్టు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రీన్ పోర్టు గుర్తింపును పొందడం వెనుక విశాఖ పోర్టు చేసిన నిరంతర కృషి దాగి ఉంది. దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలలో వంద శాతం సోలార్ పవర్ (సౌర విద్యుత్) తో నడుస్తున్న ఘనత ఒక్క విశాఖ పోర్టుకే దక్కింది.
పూర్తిగా గ్రీన్ పవర్తో కార్యకలాపాలు సాగిస్తూ పర్యావరణానికి మేలు కలిగేలా చేస్తున్నారు. దీంతో పాటు గాలిలో దుమ్ము, కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రత్యేకంగా కవర్డ్ స్టోరేజీ షెడ్లను కూడా నిర్మించారు. బెర్త్లను సైతం అత్యాధునికీకరించి కాలుష్య రహిత నౌకాశ్రయంగా తీర్చిదిద్దారు.
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం విశాఖ పోర్టు అథారిటీ సుదూర లక్ష్యాలతో పనిచేస్తోంది. దీనిలో భాగంగానే రాబోయే కాలంలో ఏకంగా 10 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా భారీ ప్లాన్ ప్రారంభించింది.
అలాగే సముద్రంలోకి సిటీలోని వ్యర్థాలు చేరకుండా అడ్డుకోవడంతో పాటు, పోర్టు ఆవరణలో 10 ఎంఎల్డీ సామర్థ్యం గల సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP), 400 కేఎల్డీ సామర్థ్యం గల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (ETP) విజయవంతంగా నడుపుతున్నారు.
ఈ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని రోడ్లపై, యార్డుల్లో దుమ్ము లేవకుండా చల్లడానికి ఉపయోగిస్తూ నీటిని పొదుపు చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా కాపాడేందుకు ప్రతి ఏటా రూ. 20 కోట్లు కేటాయించడం విశేషం.
కేవలం పర్యావరణమే కాకుండా సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలలో కూడా వైజాగ్ పోర్టు ముందంజలో నిలిచింది. సమాజ శ్రేయస్సు కోసం విద్యా, వైద్య సంరక్షణ, యూత్కు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల కోసం రూ. 4.31 కోట్ల నిధులను ఖర్చు చేసింది.
గతంలో విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో సీఎం సహాయ నిధికి (CMRF) రూ. కోటి విరాళంగా అందించి తమ ఉదారతను కూడా చాటుకుంది. వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణతో పాటు, ఇంధన పొదుపు, సామాజిక బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుంది. దీంతో ఈ ఎల్-2 గ్రీన్ పోర్టు సర్టిఫికేషన్ విశాఖ నౌకాశ్రయ కీర్తి కిరీటంలో మరో మణిహారంగా నిలిచిపోతుంది.
Annamalai : అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. వచ్చే ఎన్నికలలో పోటీపై ఏమన్నారు?
