Gold Price
బంగారం ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత దిగొచ్చిన పసిడి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్ రేట్లు ఎగబాకుతున్నాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో పెరిగిన ధరలు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లోనూ పైపైకే దూసుకెళుతున్నాయి. తాజాగా ఇవాళ(ఏప్రిల్ 1) 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1970 పెరిగింది.
దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల ధర 1,51,480 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1800 పెరిగి రూ. 1,38,850కి చేరుకుంది. మార్చి 27 నుంచి బంగారం ధరలు(Gold Price) పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధంపై ట్రంప్ చేస్తున్న పొంతన లేని ప్రకటనల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైనా గట్టిగానే పడింది. 5 రోజుల్లోనే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 4500 , 24 క్యారెట్ల ధర రూ.6 వేల వరకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర 15 వేల రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.2,65,000 కు చేరింది. గత 5 రోజుల్లో కిలో వెండి ధర 25 వేల రూపాయలు పెరిగింది. అటు అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్ లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు దాదాపు 100 డాలర్లు పెరిగి 4700 డాలర్లకు చేరింది. సిల్వర్ ధర కూడా పెరిగి 75 డాలర్లకు చేరింది. నిజానికి యుద్ధం ప్రారంభానికి ముందు అంటే జనవరి చివరి వారంలో బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. దాదాపు. 1,80,000కు పైగా ధర నమోదైంది. తర్వాత పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన ప్రకటనలతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
యుద్ధం ఆరంభించిన తర్వాత క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం భయం కూడా మొదలైంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య వార్ ముగిసిపోతుందని ట్రంప్ ప్రకటించారు. అటు తాజాగా క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గుచూపుతున్నారని, అందుకే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Tamilnadu : హద్దులు దాటుతున్న ఉచితాలు…తమిళనాట పోటాపోటీ హామీలు
